Asianet News TeluguAsianet News Telugu

మ్యాచ్ రివ్యూ: బాకీ తీర్చుకున్న రోహిత్... లెక్క సరిచేసిన కోహ్లీ

ముంబయిలో ఆసీస్ మెరవగా, రాజ్‌కోట్‌లో లెక్క సరిచేసి టీమ్‌ ఇండియా మురిసింది. సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు పాత లెక్కలను కూడా సరిచేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల ఛేదనను భారత్‌ 47.3 ఓవర్లలోనే ముగించింది. 

India vs Australia match review: Rohit pays back and Virat Sets the record straight
Author
Bengaluru, First Published Jan 20, 2020, 11:40 AM IST

హిట్‌మ్యాన్‌ అద్భుత సెంచరీ, ఛేదనలో మొనగాడు, రన్ మెషీన్ విరాట్‌ కోహ్లి అద్భుత అర్ధ శతకంతో చెలరేగారు. అమీతుమీ తేల్చుకోవాల్సిన నిర్ణయాత్మక వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. 

ముంబయిలో ఆసీస్ మెరవగా, రాజ్‌కోట్‌లో లెక్క సరిచేసి టీమ్‌ ఇండియా మురిసింది. సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు పాత లెక్కలను కూడా సరిచేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల ఛేదనను భారత్‌ 47.3 ఓవర్లలోనే ముగించింది. 

రోహిత్ శర్మ ఈ మ్యాచులో తన బాకీని కూడా చెల్లించేసుకున్నాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఈ మ్యాచులో శతకం కొట్టి ఆ బాకీ కూడా తీర్చుకున్నాడు. 

ఇక ఈ మ్యాచులో భారత ఆటతీరు అగ్ర జట్టుగా వెలుగొందిన ఆస్ట్రేలియాను పరుగులు పెట్టించిందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా గతంలో ఒక అయిదారుగారు మేటి బ్యాట్స్ మెన్ తో పాటుగా బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉండేది. 

ఈ మ్యాచులో కూడా టీం బలిష్టంగా ఉన్నప్పటికీ భారత జట్టు సమిష్టిగా వారిని ఎదుర్కున్న తీరు అద్భుతం. బౌలింగ్ నుంచి మొదలుకొని అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు ఒక కసితో కనిపించారు. కసితీరా ఆడి గెలిచారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 286/9 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ శతకంతో రాణించగా, మార్నస్‌ లబుషేన్‌ అర్థ సెంచరీతో మెరిశాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 2-1తో భారత్‌ వశమైంది. 

టీమ్‌ ఇండియా తన తదుపరి షెడ్యూల్ లో భాగంగా న్యూజిలాండ్ పర్యటనకు పయనమవనుంది. తర్వాతి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో జనవరి 24న ఆడనుంది. కివీస్‌ పర్యటనకు కోహ్లిసేన నేడు ఉదయం ఆక్లాండ్‌కు బయల్దేరనుంది. 

తూ మార్, మై మార్ రోహిత్, విరాట్ ల మంత్రం ఇదే....  

చిన్నస్వామిలో 287 పరుగుల లక్ష్యం, పెద్దదేమీ కాదు. పిచ్‌ నెమ్మదిగా ఉండటం, స్పిన్నర్లు ప్రభావం చూపిస్తుండటంతో ఓపెనర్లు ఆచితూచి ఆడారు. పవర్‌ప్లేలో 61 పరుగులు చేసి, వికెట్‌ కాపాడుకున్నారు. 

Also read: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన విరాట్ కోహ్లీ

ఫీల్డింగ్ చేస్తూ భుజం గాయానికి గురైన శిఖర్‌ ధావన్‌ స్థానంలో కెఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చాడు. నెమ్మదిగా మొదలెట్టిన రాహుల్‌ 2 ఫోర్లు కొట్టినా.. ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. ఆగర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 

తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచిన రోహిత్‌ శర్మ బెంగళూర్‌లో చెలరేగాడు. 6 సిక్సర్లు, 8 ఫోర్లతో శివమెత్తాడు. 56 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్‌.. వంద పరుగుల మైలురాయి 110 బంతుల్లో చేరుకున్నాడు. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తో కలిసి రోహిత్‌ శర్మ రెండో వికెట్‌కు 131 పరుగులు జోడించాడు. రోహిత్‌, కోహ్లి వికెట్‌కు రెండువైపులా ఆసీస్‌ బౌలర్లను ఆడుకున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో భారత్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 

సెంచరీ తర్వాత రోహిత్‌ శర్మ నిష్క్రమించినా.. విరాట్‌ కోహ్లి జోరు కొనసాగింది. శ్రేయస్ అయ్యర్‌ తో కలిసి కోహ్లి 68 పరుగులు జోడించాడు. భారత్‌ గెలుపు లాంఛనం చేశాడు. ఆఖర్లో కోహ్లి నిష్క్రమించినా అయ్యర్‌తో కలిసి మనీశ్‌ పాండే (8 నాటౌట్‌) పని పూర్తి చేశాడు. 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఆస్ట్రేలియాకు మళ్ళీ స్మిత్ మాత్రమే దిక్కయ్యాడు...  

టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా విచిత్రంగా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కొత్త బంతితో మహ్మద్‌ షమి ఆరంభంలోనే బ్రేక్‌ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ ను వికెట్ల వెనకాల దొరకబుచ్చుకున్నాడు. 

Also read: ఆస్ట్రేలియా ఓటమి... మరోసారి నిజమైన మిచెల్ స్టార్క్ సెంటిమెంట్

ఓ ఫోర్‌, సిక్సర్‌తో జోరుమీదున్న అరోన్‌ ఫించ్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. 46/2తో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. 

రెట్టించిన ఉత్సాహంతో బంతులేసిన భారత బౌలర్లను స్మిత్‌, లబుషేన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 8 ఫోర్లతో 63 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేసిన స్మిత్‌ ఆసీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. మరో ఎండ్‌లో లబుషేన్‌ 60 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. లబుషేన్‌ నిష్క్రమించినా స్మిత్‌ పోరాటం ఆగలేదు. 

11 ఫోర్లతో 117 బంతుల్లో శతకం చేశాడు. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.బ్యాటింగ్‌ పిచ్‌పై ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ జోరుకు ముకుతాడు వేసిన భారత బౌలర్లు కంగారూను 286/9 వద్ద నిలువరించడంలో సఫలీకృతులయ్యారు. 

నిన్నటి మ్యాచులో బుమ్రా వికెట్లేమీ తీయలేకపోయినప్పటికీ.... బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ పై ప్రెషర్ పెంచడంతో ఇతర బౌలర్లకు వారు చాలా సులువుగా దొరికిపోయారు. వికెట్లు సాధించలేకపోయారు కదా అని ఇప్పటికిప్పుడు బుమ్రా బౌలింగ్ పై అంచనాకు రావడం మాత్రం తప్పు. 

Follow Us:
Download App:
  • android
  • ios