Women's Asia Cup: రోడ్రిగ్స్ మెరుపులు.. టీమిండియాకు వరుసగా మూడో విజయం
Asia Cup 2022: మహిళల ఆసియా కప్ లో భారత జైత్రయాత్ర సాగుతోంది. ఏడో టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు..యూఏఈని చిత్తుగా ఓడించింది.
బంగ్లాదేశ్లోని షెల్లాట్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. యూఏఈతో ముగిసిన మ్యాచ్ లో యూఏఈని చిత్తుగా ఓడించి వరుసగా మూడో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్, 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ.. 4 వికెట్ల నష్టపోయి 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా భారత్.. 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఆదిలోనే షాకులు తగిలాయి. 4.2 ఓవర్లలో టీమిండియా.. 19 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0),హేమలత (2) లు త్వరత్వరగా ఔటయ్యారు.
కానీ దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు కలిసి యూఏఈ బౌలర్లకు చుక్కుల చూపారు. ఇద్దరూ కలిసి బౌండరీలతో భారత స్కోరును పెంచారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 129 పరుగుల భాగస్వామయాన్ని జత చేశారు. యూఏఈ 8 మంది బౌలర్లను ఉపయోగించినా ఈ ఇద్దరూ ధాటిగా ఆడి భారత్ కు భారీ స్కోరును అందించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కి మూడు ఓవర్లలోనే త్రిబుల్ షాకులు తాకాయి. తీర్త సతీష్ (1), ఈషా రోహిత్ ఒజా (4), నటాషా చెర్రిత్ (0) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆ తర్వాత కవిషా ఎగోడేజ్ (54 బంతుల్లో 30 నాటౌట్, 3 ఫోర్లు), ఖుషీ శర్మ (50 బంతుల్లో 29 నాటౌట్, 3 ఫోర్లు) టెస్టు మ్యాచ్ ఆటను ఆడుతూ వికెట్ కాపాడుకునే యత్నం చేశారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 58 పరుగులు జతచేశారు. ధాటిగా ఆడటంలో విఫలంకావడంతో యూఏఈ భారీ తేడాతో ఓడాల్సి వచ్చింది.
ఈ టోర్నీలో భారత్.. తొలి మ్యాచ్ లో శ్రీలంకతో 41 పరుగుల తేడాతో గెలవగా రెండో మ్యాచ్ లో మలేషియాపై 30 పరుగుల తేడా (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో)తో గెలిచింది. తాజాగా యూఏఈపై కూడా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత మహిళల జట్టు తదుపరి మ్యాచ్ అక్టోబర్ 6న థాయ్లాండ్ తో తలపడనుంది. అక్టోబర్ 7న పాకిస్తాన్ తో ఆడనుంది. భారత్ ఖాతాలో ఇప్పటికే ఆరు ఆసియా కప్ లు ఉన్న విషయం తెలిసిందే.