Virat Kohli's 100th Test: తమ అభిమాన నాయకుల మీద ప్రేమ ఉండటంలో తప్పులేదు. కానీ వాళ్ల మీద బాధ్యతలు పెడితే...? ఇక అది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన బాధ్యత అయితే...?
మన కోరిక ఎంత బలంగా ఉన్నా దానికి చేయాల్సిన ఆచరణ కూడా అంతే బలంగా ఉండాలి. లేకుంటే అది నెరవేరదు. ఇది వ్యక్తిగతమే. ఇక ఇతరుల మీద ఆశలు పెట్టుకుంటే అంతే. మన కోరికలను ఇతరుల మీద రుద్ది.. వాటిని వాళ్లను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంటే అది అంత వీజీ కాదు. ఈ ఉపోద్ఘాతతమంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. టీమిండియా సారథి విరాట్ కోహ్లి అభిమాని ఒకరు.. అతడు సెంచరీ చేస్తే గానీ తాను పెళ్లి చేసుకోబోనని మంగమ్మ శపథం చేశాడు. మరి రెండున్నరేండ్లుగా శతక కరువుతో అల్లాడుతున్న కోహ్లి.. ఈ అభిమాని కోరికను తీర్చుతాడా..? అతడి పెళ్లి చేస్తాడా..?
సాధారణంగా ఇలాంటి ప్రతిజ్ఞలు రాజకీయాల్లో చూస్తుంటాం. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే కావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని.. అప్పటిదాకా జట్టు కత్తిరించబోమని కోరుకుంటారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు తమ అభిమానుల కోరికను నెరవేర్చితే మరికొందరు మాత్రం... అంతే సంగతులు.
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు టీమిండియా సారథి విరాట్ కోహ్లికి వందో టెస్టు. ఈ టెస్టులో అతడు సెంచరీ చేయాలని కోహ్లి అభిమానులంతా ఆశించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన కోహ్లి మాత్రం.. 76 బంతుల్లో 45 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు.
ఇక ఒకప్పుడు సెంచరీల మీద సెంచరీలు చేసిన కోహ్లి.. రెండున్నరేండ్లుగా అదేదో తనకు సంబంధం లేని వ్యవహారంగా మారిపోయాడు. ఈ టెస్టు సందర్భంగా మొహాలీకి వచ్చిన కోహ్లి అభిమానులు కొంతమంది.. ‘విరాట్ కోహ్లి 71వ సెంచరీ చేసేదాక నేను పెళ్లి చేసుకోబోను..’ అని ప్లకార్డు పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే పలువురు విరాట్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం.. ‘అయితే నీకు పెళ్లైనట్టే పో...’ ‘ఇక కష్టమే..’ ‘కోహ్లి సెంచరీ చేయడు.. నీకు పెళ్లి కాదు.. గోవిందా గోవిందా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మొహాలీ టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 8 వికెట్లు కోల్పోయి 574 పరుగులు చేసింది. రాక్ స్టార్ రవీంద్ర జడేజా 228 బంతుల్లో 175 రన్స చేశాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96), అశ్విన్ (61), హనుమ విహారి (58) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్ లో 65 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా.. 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులు వెనుకబడి ఉన్న లంక.. రెండో ఇన్నింగ్స్ లో.. 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఏంజెలొ మాథ్యూస్ (20 నాటౌట్), ధనంజయ డి సిల్వ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
