India Vs South Africa 3rd Test: 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే...
దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత బౌలర్లు లంచ్ సమయానికి రెండు వికెట్లే తీయగలిగారు. 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టిన భారత బౌలర్లు తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయారు. పేస్ కు అనుకూలిస్తున్న కేప్టౌన్ పిచ్ పై టీమిండియా పేస్ త్రయాన్ని తట్టుకుని దక్షిణాఫ్రికా బ్యాటర్లు పీటర్సన్, డసెన్.. సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్నారు.
17 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండో రోజు తొలి ఓవర్ (దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 8వ ఓవర్) వేసిన బుమ్రా.. రెండో బంతికే ప్రమాదకర ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (8) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్ కు ఆవలగా వెళ్తున్న బంతిని వదిలేసిన మార్క్రమ్ అంచనా తప్పింది. బాల్ వెళ్లి నేరుగా వికెట్ ను పడగొట్టింది. దీంతో 17 పరుగుల వద్దే సఫారీలు రెండో వికెట్ కోల్పోయారు. మార్క్రమ్ నిష్క్రమించడంతో పీటర్సన్ క్రీజులోకి వచ్చాడు.
కొద్దిసేపటి తర్వాత నైట్ వాచ్ మెన్ కేశవ్ మహారాజ్ (25)ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేశాడు. దీంతో 45 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. కానీ పీటర్సన్ (86 బంతుల్లో 40 బ్యాటింగ్), డసెన్ (45 బంతుల్లో 17 బ్యాటింగ్) వికెట్లకు అడ్డుగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఇప్పటికే 55 పరుగుల భాగస్వామ్యం జోడించారు. లంచ్ విరామం కల్లా దక్షిణాఫ్రికా 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి వంద పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సులో ఆ జట్టు ఇంకా 123 పరుగులు వెనుకబడి ఉంది.
కాగా.. బుమ్రా బౌలింగ్ లో అవుటైన మార్క్రమ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రత్యర్థి జట్టుపై అత్యంత తక్కువ సగటు నమోదు చేసిన మూడో ఓపెనర్ గా మార్క్రమ్ నిలిచాడు. ఈ టెస్టులో అతడి సగటు 16.26 మాత్రమే. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో మార్క్రమ్ చేసిన పరుగులు 60.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 223 పరుగులే చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) విఫలమైనా పుజారా (43) కెప్టెన్ విరాట్ కోహ్లి (79) లు మెరుగ్గా ఆడారు. పుజారా నిష్క్రమించిన తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (27) కాసేపు కోహ్లికి అండగా నిలిచాడు. కానీ అతడు కూడా ఎక్కువసేపు నిలువలేదు. కోహ్లి చివరికంటా పోరాడటంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
