Ind Vs SA: వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ ఇద్దరికీ ఛాన్స్.. సఫారీ టూర్ లోని టీమిండియా వన్డే జట్టులో మార్పులు
Jayant Yadav-Navdeep Saini: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఈనెల 19 నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభించబోతున్నది. ఈ మేరకు భారత వన్డే జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ముందు కరోనా బారిన పడ్డ టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సఫారీ టూర్ కు దూరమయ్యాడు. నిన్న అతడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే జట్టులో టీమిండియా మార్పులు చేసింది. సుందర్ స్థానంలో టీమిండియా ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ కు స్థానం కల్పించింది. అతడితో పాటు నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది.
ఈనెల 19 నుంచి భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి 50 ఓవర్ల మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందే జట్టుకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. కరోనా బారిన పడటంతో అతడి స్థానాన్ని జయంత్ యాదవ్ భర్తీ చేస్తాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు ఆడుతూ గాయపడ్డ మహ్మద్ సిరాజ్ కు బ్యాకప్ గా నవదీప్ సైనీని ఎంపిక చేశారు.
సుమారు పదినెలల తర్వాత జట్టులోకి వచ్చిన సుందర్.. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడ్డాడు. గతేడాది ఇంగ్లాండ్ టూర్లో కౌంటీ ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడటంతో అతడు.. దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్కి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని తమిళనాడు తరుపున విజయ్ హాజారే ట్రోఫీ 2021లో పాల్గొన్నాడు. ఆ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో సెలెక్టర్లు అతడిని సౌతాఫ్రికా టూర్ కు ఎంపిక చేశారు.
ఈ సిరీస్ కు ముందే పరిమిత ఓవర్ల క్రికెట్ కు పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ.. ఫిట్నెస్ సమస్యలతో టూర్ కు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో కెఎల్ రాహుల్.. భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు.
దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ కు భారత జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, ఆర్. అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ
సౌతాఫ్రికా-టీమిండియా వన్డే షెడ్యూల్ :
- జనవరి 19న తొలి వన్డే : బొలాండ్ పార్క్, పార్ల్
- జనవరి 21 న రెండో వన్డే : బొలాండ్ పార్క్, పార్ల్
- జనవరి 23 న మూడో వన్డే : న్యూలాండ్స్ , కేప్టౌన్