Ind Vs Pak: ఇది పాక్ గెలుపు కాదు.. ఇస్లాం విజయం.. భారత్ లో వారి మద్దతు మాకే : పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
T20 worldcup2021: పాకిస్థాన్ కు చెందిన అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ఇస్లాం విజయమని, భారత్ లోని ముస్లింలు కూడా పాక్ కే సపోర్ట్ చేశారని రషీద్ చెప్పుకొచ్చారు.
టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) లో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన హోరాహోరి పోరులో భారత్ (India) మునుపెన్నడూ లేని విధంగా పది వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో భారత్ ముందు తలవంచుతారని పేరున్న పాక్ (Pakistan).. కొత్త చరిత్రను రాస్తూ గత రికార్డును చెరిపేసింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ పై ఇరు దేశాల్లోని క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఎవరికి తోచినవిధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ పాక్ కు చెందిన ఓ మంత్రి మాత్రం భారత్ పై తనకున్న అక్కసును వెళ్లగక్కారు.
పాకిస్థాన్ కు చెందిన అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Rashid ahmad) ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పాక్ (India vs Pakistan) మ్యాచ్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ.. ‘ముందుగా భారత్ పై విజయం సాధించిన పాకిస్థాన్ జట్టుకు కృతజ్ఞతలు. ఈ మ్యాచ్ లో పట్టుదల, దృఢ సంకల్పం, ధైర్యాన్ని ప్రదర్శించి చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసినందుకు నేను పాక్ జట్టుకు సెల్యూట్ చేస్తున్నాను. ముస్లిం ప్రపంచం ముందు పాక్ తన ధర్మాన్ని నిర్వర్తించింది. కొన్ని పనుల వల్ల నేను ఈ మ్యాచ్ ను వీక్షించలేకపోయాను. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లలో నేను చూడని మ్యాచ్ కూడా ఇదే’ అని అన్నారు.
ఇంకా ఆయన స్పందిస్తూ.. ‘రావల్పిండి, ఇస్లామాబాద్ లో రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్లను తీసేయమని నేను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్లకు సూచించాను. ఎందుకంటే ఈ విజయాన్ని వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మనకు (పాకిస్థాన్ కు ) ఫైనల్ మ్యాచ్ తో సమానం. అవును, టీ20 ప్రపంచకప్ లో ఇది కచ్చితంగా మనకు ఫైనల్ మ్యచే..’ అని పేర్కొన్నారు.
ఈ విజయం ఇస్లాం విజయమని, భారత్ లోని ముస్లిం (Indian Muslims)లు కూడా పాక్ కే సపోర్ట్ చేశారని రషీద్ చెప్పుకొచ్చారు. ‘ముస్లిం ప్రపంచం నుంచి పాక్ టీమ్ కు భావోద్వేగమైన మద్దతు ఉంది. భారత్ లోని ముస్లింలు కూడా పాక్ నే సపోర్ట్ చేశారు. ఇది ముస్లిం ప్రపంచం విజయం. పాకిస్థాన్ జిందాబాద్.. ఇస్లాం జిందాబాద్’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ తో మ్యాచ్ గెలిచాక పాకిస్థాన్ లో సంబురాలు మిన్నంటాయి. పాక్ అభిమానులు వీధుల్లోకి వచ్చి టపాసులు కాల్చారు. గన్స్ తో రచ్చ రచ్చ చేశారు.