ముంబైకి ఆడినప్పుడు టీమిండియాకి ఆడలేడా? సెలక్టర్లకు సెహ్వాగ్ సూటిప్రశ్న... ‘థ్యాంక్యూ రోహిత్’ అంటూ...
ఇది బీసీసీఐ చేస్తున్న ఘోర తప్పిదం. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తరుపున ఆడగలిగినప్పుడు, భారత జట్టు తరుపున ఎందుకు ఆడలేడు...
బీసీసీఐ సెలక్షన్ పద్ధతిని సూటిగా ప్రశ్నించిన వీరేంద్ర సెహ్వాగ్...
రోహిత్ శర్మ మీద కోపంతో రిటైర్ అయ్యారంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తున్న ధోనీ, కోహ్లీ అభిమానులు...
IPL 2020 సీజన్లో రోహిత్ శర్మ గాయం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తొడ కండరాలు పట్టేయడంతో డబుల్ సూపర్ ఓవర్లో క్రీజులోకి రాని రోహిత్ శర్మ... ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లో బరిలో దిగలేదు. దీంతో ఐపీఎల్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా టూర్కి రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను పక్కనబెట్టడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఓ వైపు బీసీసీఐ రోహిత్ శర్మకు తీవ్రగాయమైందని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతుంటే... సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరుపున బరిలో దిగాడు రోహిత్ శర్మ. దీంతో సెలక్టర్ల వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ దీనిపై కామెంట్ చేశాడు. ‘ఇది బీసీసీఐ చేస్తున్న ఘోర తప్పిదం. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తరుపున ఆడగలిగినప్పుడు, భారత జట్టు తరుపున ఎందుకు ఆడలేడు?’ అంటూ సెలక్టర్లను సూటిగా ప్రశ్నించాడు వీరూ.
మరోవైపు ధోనీ, విరాట్ అభిమానులు... రోహిత్ శర్మను ట్రోల్ చేస్తూ ‘థ్యాంక్యూ రోహిత్’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లో 4 పరుగులకే అవుటైన రోహిత్ శర్మ... ‘ముంబై ఇండియన్స్ తరుపున ఆఖరి మ్యాచ్ ఆడేందుకు వచ్చానంటూ’ అని వ్యాఖ్యానించినట్టుగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ధోనీ జట్టు ఘోరంగా ఓడిపోవడం, విరాట్ కోహ్లీ జట్టు పెద్దగా రాణించకపోవడంతో ఈ విధంగా రోహిత్ శర్మను టార్గెట్ చేశారు కొందరు అభిమానులు.