నేను చనిపోయే ముందు చూడాలనుకుంటున్న రెండు క్షణాలవే : గవాస్కర్ భావోద్వేగం
Sunil Gavaskar: నిత్యం నవ్వుతూ నవ్విస్తూ ఉండే భారత క్రికెట్ జట్టు దిగ్గజం సునీల్ గవాస్కర్ భావోద్వేగాకిని గురయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనితో ఆటోగ్రాఫ్ తీసుకోవడంపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చెన్నైలోని చెపాక్ వేదికగా ముగిసిన మ్యాచ్ తర్వాత ధోని సేన.. స్టేడియంలో కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సందర్భంలో అక్కడే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. వెంటనే ధోని దగ్గరకి వెళ్లి ఆటోగ్రాఫ్ అడగడం.. మహేంద్రుడు కాదనకుండా ఇవ్వడం .. నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా గవాస్కర్ ఈ మూమెంట్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
స్టార్ స్పోర్ట్స్ లో తనకు ధోని ఆటోగ్రాఫ్ ఇవ్వడం గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. ‘చెపాక్ లో ధోనితో కలిసి ఆటగాళ్లంతా కలియతిరుగుతూ అభివాదం చేస్తారన్న విషయం నాకు తెలియదు. కానీ అది తెలియగానే నేను అక్కడ ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించుకున్నా..
అనుకున్నదే తడువుగా మా కెమెరామెన్ దగ్గర మార్కర్ పెన్ తీసుకుని ధోని దగ్గరకి వెళ్లాను. ఆ సమయానికి కెమెరామెన్ దగ్గర పెన్ ఉండటం సంతోషించదగ్గది. ఈ సందర్భంగా నేను అతడికి కృతజ్ఞత చెప్పదలుచుకున్నా. పెన్ ఇవ్వగానే మహి దగ్గరకు వెళ్లి నా షర్ట్ పై ఆటోగ్రాఫ్ కావాలని అడిగాను. దానికి అతడు అంగీకరించడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఆ మూమెంట్ నాకు చాలా ఉద్వేగమైన క్షణం.
భారత క్రికెట్ లో ధోనిని ఇష్టపడని వారుండరు. టీమిండియా కోసం అతడు ఏం చేయలేదో చెప్పండి.. దేశంలో చాలా మంది యువకులకు ధోని ఆదర్శం.. నాకు చివరి క్షణాల్లో 2 నిమిషాల్లో రెండు ప్రత్యేకమైన క్షణాలను చూడాలనుకుంటే నేను.. ఒకటి 1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తుకున్న సందర్భంతో పాటు 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ధోని వాంఖెండేలో విన్నింగ్ షాట్ కొట్టిన క్షణాలను చూడాలనుకుంటా..’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సన్నీ.
ఆన్ ఫీల్డ్ తో పాటు ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా సన్నీ ఇంత ఎమోషనల్ అవడం చాలా అరుదు. నిత్యం నవ్వుతూ తన చుట్టూ ఉండేవారిని నవ్విస్తూ ఉండే గవాస్కర్.. ఈ వీడియోలో ఆటోగ్రాఫ్ తీసుకున్న క్షణంతో పాటు తన చివరి కోరికలు ఇవేనంటూ చెప్పినప్పుడు చాలా ఎమోషన్ అయ్యాడు. అదే సమయంలో యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్ తో పాటు యాంకర్లు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.