సారాంశం

India vs Sri Lanka: 4 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ.. ఆసియాలో 8 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. 

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, సొంత మైదానంలో 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ముంబైలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫోర్ బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో బంతిని పూర్తిగా మిస్ అయిన రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 400 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ ఫోర్ బాది ఖాతా తెరిచాడు. 

తన తొలి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్‌కి, ఆ తర్వాతి ఓవర్‌లో విరాట్ కోహ్లీకి పరుగులు ఇవ్వకుండా రెండు మెయిడిన్స్‌తో బౌలింగ్ మొదలెట్టాడు దుస్మంత ఛమీరా. మధుశంక బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని అసలంక అందుకోలేకపోయాడు.

ఆ తర్వాత ఛమీరా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఛాన్స్ వచ్చింది. అయితే కోహ్లీ ఇచ్చిన ఆ క్యాచ్‌ని ఛమీరా ఒడిసి పట్టలేకపోయాడు.. 4 బంతుల వ్యవధిలో ఇద్దరు బ్యాటర్లకు లైఫ్ దక్కింది.

విరాట్ కోహ్లీ, ఆసియాలో 8 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ 159 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా సచిన్ టెండూల్కర్ 188, కుమార సంగర్కర 213, సనత్ జయసూర్య 254 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు..

సచిన్ టెండూల్కర్ ఏషియాలో 12067 వన్డే పరుగులు చేసి టాప్‌లో ఉంటే, సనత్ జయసూర్య 8448, కుమార సంగర్కర 8249 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.