వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసిన పాకిస్తాన్... ఫకార్ జమాన్ రికార్డు సెంచరీ...

2022 టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో జింబాబ్వే చేతుల్లో ఓడినా, లక్కు ఈడ్చి పెట్టి తన్నడంతో సెమీ ఫైనల్‌కి, అటు నుంచి ఫైనల్‌కి దూసుకెళ్లింది పాకిస్తాన్. 2023 వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా 4 మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్‌ని మరోసారి లక్ పలకరించేలా ఉంది. సెమీస్ ఛాన్సులు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ బౌలర్లు తేలిపోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. 9 బంతుల్లో 4 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్‌ని టిమ్ సౌథీ అవుట్ చేశాడు. 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్..

అయితే ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్ కలిసి రెండో వికెట్‌కి అజేయంగా 117 బంతుల్లో 154 పరుగులు జోడించారు. 63 బంతుల్లో సెంచరీ అందుకున్న ఫకార్ జమాన్, వన్డే వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పాకిస్తాన్ బ్యాటర్‌గా నిలిచాడు.

వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది పాకిస్తాన్. ఫకార్ జమాన్ 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేయగా బాబర్ ఆజమ్ 51 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ చేయాల్సిన పరుగుల కంటే 10 పరుగులు ఎక్కువే చేసింది.

వర్షం తగ్గి ఆట తిరిగి ప్రారంభం కాకపోతే 401 పరుగుల రికార్డు స్కోరు చేసిన న్యూజిలాండ్‌ ఓడిపోవాల్సి ఉంటుంది. లక్కీగా పాకిస్తాన్, సెమీస్ రేసులోకి దూసుకొచ్చే అవకాశం ఉంది.