యువకులు, అనుభవజ్ఞులతో టీమిండియా సమతూకంగా ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ధోని, కోహ్లి జట్టులో ఉండటం మరింత కలిసొచ్చే అంశమని అన్నారు. భారత జట్టు కచ్చితంగా టాప్‌ 4లో నిలుస్తుందని అన్నారు.

న్యూఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సత్తా చాటుతుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ధీమా వ్యక్తం చేశారు. విరాట్‌ కోహ్లి సేన టాప్‌ జట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ఆయన అన్నారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

యువకులు, అనుభవజ్ఞులతో టీమిండియా సమతూకంగా ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ధోని, కోహ్లి జట్టులో ఉండటం మరింత కలిసొచ్చే అంశమని అన్నారు. భారత జట్టు కచ్చితంగా టాప్‌ 4లో నిలుస్తుందని అన్నారు. విజేతగా ఏ జట్టు నిలుస్తుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

ఏయే జట్లు సెమీస్‌ కు చేరతాయనే విషయంపై ఆయన స్పందించారు. భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు చేరే అవకాశం ఉందని అన్నారు. నాలుగో బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా పోటీ పడే అవకాశం ఉందని అన్నారు. 

ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లు ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తాయని అన్నారు. టీమిండియాకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కచ్చితంగా ప్లస్‌ అవుతాడని, అతడిని అధిక ఒత్తిడికి గురిచేయకుండా సహజశైలిలో అడనివ్వాలని అన్నారు. 

జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారని, జట్టులో వీరిద్దరూ కూడా కీలకమని కపిల్‌దేవ్‌ తెలిపారు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్‌ 5న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడుతుంది.