Womens World Cup 2023: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టు  రెండో విక్టరీ కొట్టింది. తొలి మ్యాచ్ లో   పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్ లో  వెస్టిండీస్ కు చుక్కలు చూపించింది. 

మహిళల ప్రపంచకప్ లో భారత్ కు రెండో విజయం దక్కింది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. తొలుత బౌలింగ్ లో కరేబియన్ అమ్మాయిలను 118 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత 119 పరగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌలింగ్ లో దీప్తి శర్మ (3-15) మెరవగా బ్యాటింగ్ లో సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 33, 3 ఫోర్లు), రిచా ఘోష్ (32 బంతుల్లో 44, 5 ఫోర్లు) లు రాణించారు. లక్ష్య ఛేదనలో ఈ విజయంతో భారత్ టోర్నీలో మరింత ముందడుగు వేసింది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఈనెల 18న ఇంగ్లాండ్ తో ఆడనుంది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కు ధనాధన్ ఆరంభం దక్కింది. తొలి మూడు ఓవర్లలోనే టీమిండియా స్కోరు 30 పరుగులు దాటింది. ఓపెనర్ షఫాలీ వర్మ (23 బంతుల్లో 28, 5 ఫోర్లు) ఎప్పటిలాగే దూకుడుగా ఆడింది. కానీ స్మృతి మంధాన (10) మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయింది.

రమ్హరక్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి మంధాన బౌల్డ్ అయింది. వన్ డౌన్ లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (1) నిరాశపరిచింది. మాథ్యూస్ బౌలింగ్ లో ఆమెకే క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. రమ్హరక్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి షఫాలీ కూడా ఫ్లెచర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో భారత్ 43 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. పది ఓవర్లకు భారత స్కోరు 64-3గా ఉంది. 

ఆదుకున్న రిచా, హర్మన్‌ప్రీత్.. 

43కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ను వికెట్ కీపర్ రిచా ఘోష్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్నారు. వికకెట్ల మధ్య పరుగెత్తుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 15 ఓవర్లలో భారత్ స్కోరు 98-3 పరుగులకు చేరింది. ఆ తర్వాత రిచా.. 16వ ఓవర్లో ఫోర్ కొట్టింది. గజ్నబి వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి భారత్ ను విజయానికి మరింత దగ్గర చేసింది. చివర్లో హర్మన్‌ప్రీత్ నిష్క్రమించినా అప్పటికే భారత విజయం ఖరారైపోయింది.

Scroll to load tweet…

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో టేలర్ (42), క్యాంప్‌బెల్ (30) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా .. రేణుకా సింగ్, పూజా వస్త్రకార్ లు తలో వికెట్ తీశారు.