ICC Womens T20 World Cup 2023: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్  స్మృతి మంధాన విజృంభించింది.  ఐర్లాండ్ బౌలర్లను ఉతికారేసింది. మిగతా బ్యాటర్లు విఫలమైన చోట మంధాన  రెచ్చిపోయింది.

మహిళల ప్రపంచకప్ లో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (56 బంతుల్లో 87, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగుల మోస్తారు స్కోరు చేసింది. సహచర బ్యాటర్లు అందించిన సహకారంతో చెలరేగిపోయిన మంధాన.. తొలుత నెమ్మదిగా ఆడినా తర్వాత రెచ్చిపోయింది. త‌ృటిలో సెంచరీ మిస్ అయింది. ఈ మ్యాచ్ లో భారత పేసర్లు ఐర్లాండ్ ను ఎంత తక్కువకు నిలువరించగలిగితే భారత్ కు అంతమంచిది. నెట్ రన్ రేట్ ను పెంచుకోవడం ఇప్పుడు భారత్ కు అత్యావశ్యకం.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. స్మృతి, షఫాలీ వర్మ (29 బంతుల్లో 24, 3 ఫోర్లు) తొలి వికెట్ కు 9.3 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. లీ పాల్ వేసిన ఆరో ఓవర్లో తలో బౌండరీ బాదిన ఈ ఇద్దరూ మరీ ఫాస్ట్ గా ఆడకున్నా రన్ రేట్ పడిపోనీయలేదు. కారా ముర్రే వేసిన 8వ ఓవర్ లో మూడో బంతికి మంధాన సింగిల్ తీయడం ద్వారా భారత్ స్కోరు 50 పరుగులు దాటింది.

డీల్ని వేసిన పదో ఓవర్లో షఫాలీ.. అమీ హంటర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. తన కెరీర్ లో 150వ టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13) నిరాశపరిచింది. కానీ మంధాన మాత్రం రెచ్చిపోయి ఆడింది. ప్రెండెర్గస్ట్ బౌలింగ్ లో బౌండరీ బాదిన ఆమె.. ముర్రే బౌలింగ్ లో భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మంధానకు ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో అర్థ శతకం. ఆ తర్వాత జార్జినా వేసిన 15వ ఓవర్లో ఆమె బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టింది. 15 ఓవర్లకు భారత్ స్కోరు 105 పరుగులకు చేరింది. డీల్ని బౌలింగ్ లో మంధాన మూడో బంతికి భారీ సిక్సర్ బాదింది. కానీ ఐదో బంతికి హర్మన్‌ప్రీత్ ఇచ్చిన క్యాచ్ ను ప్రెండర్గస్ట్ సూపర్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపింది. అదే ఓవర్లో రిచా ఘోష్ (0) కూడా భారీ షాట్ ఆడబోయి గాబీ లూయిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 

రిచా స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (19) తో కలిసి మంధాన రెచ్చిపోయింది. కెల్లీ వేసిన 17వ ఓవర్లో ఐదో బంతికి బౌండరీ బాదిన మంధాన.. డీల్ని వేసిన తర్వాతి ఓవర్లో మరో బౌండరీ సాధించి 80లలోకి వచ్చింది. ప్రెండెర్గస్ట్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి లూయిస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరింది. ఆ తర్వాతి బంతికే దీప్తి శర్మ (0) కూడా ఔటయ్యింది.

ఇక చివరి ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదిన రోడ్రిగ్స్ తర్వాత రెండు బంతులను వృథా చేసింది. మూడో బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా భారత స్కోరు 150 దాటింది. ఐదో బంతికి ఫోర్ కొట్టిన రోడ్రిగ్స్.. ఆరో బంతికి ఔట్ అయింది. ఫలితంగా భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఐర్లాండ్ కెప్టెన్ లారా డీల్నికి మూడు వికెట్లు దక్కగా ఒర్ల ప్రెండర్గస్ట్ కు రెండు వికెట్లు దక్కాయి.