Under 19 Women's T20 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న   ఐసీసీ మహిళల అండర్ - 19 ప్రపంచకప్ లో  భారత జట్టు  గ్రాండ్ విక్టరీ కొట్టింది. సూపర్ సిక్స్ దశలో తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడినా తర్వాత పుంజుకుంది. 

ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ లో భాగంగా జరుగుతున్న సూపర్ సిక్స్ పోటీలలో భారత్ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినా తర్వాత అద్భుతంగా పుంజుకుంది. శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. సెన్వస్ పార్క్ వేదికగా ఆదివారం ముగిసిన పోరులో లంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక అమ్మాయిలను 59 పరుగులకే నిలువరించిన భారత్.. ఆ తర్వాత లక్ష్యాన్ని 7.2 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియా బౌలర్ పర్శవి చోప్రా కు నాలుగు వికెట్లు దక్కగా.. మన్నత్ కశ్యప్ రెండు వికెట్లు తీసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. లంకను బెంబేలెత్తించింది. స్కోరు బోర్డుపై పరుగులేమీ చేరకుండానే ఆ జట్టు ఓపెనర్ సేనరత్నె డకౌట్ అయింది. మరో ఓపెనర్ నిసలంక (2) కూడా అదే బాట పట్టింది.

స్పినర్లు రంగ ప్రవేశం చేశాక లంక విలవిలలాడింది. పర్శవి చోప్రా.. లంక కెప్టెన్ విష్మీ గుణరత్నే (25), ననయక్కర (5), విహార సెవ్వంది (0), దిస్సనాయకె (2) లను ఔట్ చేసింది. ఆ జట్టు తరఫున కెప్టెన్ గుణరత్నేనే టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులకే పరిమితమైంది. 

Scroll to load tweet…

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన భారత ఓపెనర్లు ఎప్పటిలాగే దూకుడుగా ఆడేందుకు యత్నించారు. కానీ ఆ క్రమంలో వికెట్లు కోల్పోయారు. షఫాలీ వర్మ (10 బంతుల్లో 15, 1 ఫోర్, 1 సిక్స్), శ్వేతా సెహ్రావత్ (17 బంతుల్లో 13, 2 ఫోర్లు) వెంటవెంటనే ఔటయ్యారు. రిచా ఘోష్ (4) కూడా నిష్క్రమించినా.. సౌమ్య తివారి (15 బంతుల్లో 28, 5 ఫోర్లు) దూకుడుగా ఆడి లంక ఆశలపై నీళ్లు చల్లింది. నాలుగు వికెట్లు తీసిన పర్శవికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Scroll to load tweet…