అండర్19 వుమెన్స్ వరల్డ్ కప్: టీమిండియాకి శుభారంభం... సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఘన విజయం...
సౌతాఫ్రికా వుమెన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు... షెఫాలీ వర్మ ఆల్రౌండ్ షో... అజేయంగా 92 పరుగులు చేసిన శ్వేతా షెరావత్..
మొట్టమొదటి ఐసీసీ వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకి శుభారంభం లభించింది. సౌతాఫ్రికా వుమెన్స్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది...
ఎలంద్రీ రెన్స్బర్గ్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేయగా కెప్టెన్ ఓలుహే సియో డకౌట్ అయ్యింది. కేల రెనెక్ 11 పరుగులు, మడిసన్ లాన్స్మన్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 32 పరుగులు చేయగా సిమోన్ లారెన్స్ 44 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 61 పరుగులు చేసి రనౌట్ అయ్యింది.
వికెట్ కీపర్ కరబో మెసో 11 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు, మియనో స్మిత్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో కెప్టెన్ షెఫాలీ వర్మ 2 వికెట్లు తీయగా సోనమ్ యాదవ్, పర్శవీ చోప్రా తలా ఓ వికెట్ తీశారు..
167 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి శుభారంభం దక్కింది. శ్వేతా షెరావత్తో కలిసి తొలి వికెట్కి 77 పరుగుల భాగస్వామ్యం జోడించింది కెప్టెన్ షెఫాలీ వర్మ. 16 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 45 పరుగులు చేసిన షెఫాలీ వర్మ అవుటైన తర్వాత తెలుగమ్మాయి గొంగడి త్రిషా 11 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుటైంది.
సౌమ్య తివారి 10 పరుగులు చేయగా ఓపెనర్ శ్వేతా షెరావత్ 57 బంతుల్లో 20 ఫోర్లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసిన భారత మహిళా జట్టు, 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలవగా స్కాట్లాండ్ని 6 వికెట్ల తేడాతో ఓడించింది యూఏఈ మహిళా జట్టు. యునైటెడ్ స్టేట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక మహిళా జట్టు...
భారత జట్టు తన తర్వాతి మ్యాచ్ని జనవరి 16న యూఏఈ టీమ్తో ఆడనుంది. ఆ తర్వాత జనవరి 18న స్కాట్లాండ్తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా..