ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్: టీమిండియాదే టాప్...వెనకబడ్డ ఆసిస్
ఐసిసి టెస్ట్ ఛాంపియన్ షిన్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, టీమిండియా రెండు టెస్ట్ మ్యాచుల్లో విజయం సాధించినా ఐసిసి నిబంధనల ప్రకారమే కోహ్లీసేనే టాప్ లో నిలిచింది.
ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా బోణీ అదిరింది. ఈ టోర్నీలో భాగంగా వెస్టిండిస్ తో తలపడ్డ భారత్ రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ గెలిచి 120 పాయింట్లతో టాప్ లో నిలిచింది. భారత్ తో సమానంగా ఆస్ట్రేలియా కూడా రెండు టెస్ట్ మ్యాచుల్లో విజయం సాధించినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐసిసి నిబంధనలే భారత్ ను టాప్ లో నిలబెట్టాయి.
టీ20ల రాకతో రోజురోజుకూ ఆదరణ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్ ను బ్రతికించాలన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ టెస్ట్ ఛాంపియన్షిప్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లయిన వన్డే, టీ20లకు ప్రపంచ కప్ పేరుతో టోర్నీని నిర్వహిస్తున్నట్లే టెస్ట్ ఫార్మాట్ లో ఛాంపియన్షిప్ నిర్వహిస్తోంది. ఇందులోకూడా అంతర్జాతీయ జట్లన్ని పాల్గొంటాయి.
ఇందుకోసం ఐసిసి కొన్ని నిబంధలను రూపొందించింది. ప్రతి జట్టు మిగతా అన్ని అంతర్జాతీయ జట్లతో రెండేళ్లలోపు టెస్ట్ సీరిస్ ఆడాల్సి వుంటుంది. ఈ క్రమంలో గెలుపొందిన జట్లు కొన్ని నిబంధనలను అనుసరించి పాయింట్లను పొందుతాయి. ఉదాహరణకు భారత్-వెస్టిండిస్ ల మధ్య జరిగిన మ్యాచ్ నే తీసుకుంటే రెండు మ్యాచుల్లో గెలుపొందిన టీమిండియా 120 పాయింట్లను పొందింది. అదే ఐదు టెస్టుల సీరిస్ లో రెండిట్లో గెలిచి, ఒక్కింట ఓటమిపాలై, మరో మ్యాచ్ డ్రా చేసుకున్న ఆసిస్ మొత్తం(24+24+8) 56 పాయింట్లను మాత్రమే పొందింది. అంటే 120 పాయింట్లను మ్యాచుల ఆధారంగా డివైడ్ చేస్తారన్నమాట.
ఇలా రెండు టెస్టుల సీరిస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన(60+60) 120 పాయింట్లను పొందింది. అదే ఆసిస్ యాషెస్ సీరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు మ్యాచులు ఆడుతోంది. కాబట్టి తక్కువ పాయింట్లు పొందింది. ఐసిసి నిబంధనల మూలంగా భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అగ్రస్థానంలో నిలిచింది.