T20 Worldcup: విరాట్ పై పెరుగుతున్న ఒత్తిడి.. భువీకి పొంచి ఉన్న ముప్పు.. కోహ్లి దారెటు..?
India vs Newzealand Live: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నుంచి మొదలు వీరేంద్ర సెహ్వాగ్ దాకా.. పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ నుంచి ఆకాశ్ చోప్రా వరకూ అందరిదీ ఒకే మాట. తర్వాత మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ఆ ఆటగాడిని మాత్రం ఆడించొద్దని...
ప్రి క్వార్టర్స్ గా భావిస్తున్న భారత్-న్యూజిలాండ్ (India Vs Newzealand) పోరాటానికి సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్.. టోర్నీలో సెమీస్ కు వెళ్తుందా..? లేదా..? అనే విషయమ్మీద స్పష్టత రానుంది. ఒకవేళ భారత్ (TeamIndia) ఓడిపోతే మాత్రం దాదాపు ఇంటిదారి పట్టినట్టే. ఈ నేపథ్యంలో టీమిండియాలోని స్టార్ బౌలర్ విషయంపై భారత సారథి విరాట్ కోహ్లి (Virat Kohli)పై ఒత్తిడి పెరుగుతున్నది. ఆ బౌలరే భువనేశ్వర్.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నుంచి మొదలు వీరేంద్ర సెహ్వాగ్ దాకా.. పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ నుంచి ఆకాశ్ చోప్రా వరకూ అందరిదీ ఒకే మాట. తర్వాత మ్యాచ్ లో భారత్ (India) గెలవాలంటే ఆ ఆటగాడిని మాత్రం ఆడించొద్దని... అతడే భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (bhuvaneshwar). ఫామ్ లేమితో తంటాలు పడుతున్న భువీని.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆడించొద్దని సీనియర్ క్రికెటర్లు విరాట్ కు సూచిస్తున్నారు.
ఇక ఇదే విషయమై తాజాగా మణికట్టు మాంత్రికుడు, భారత మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కూడా స్పందించాడు. భువీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ను తుది జట్టులోకి తీసుకోవాలని అతడు కోహ్లికి సూచించాడు. లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘నేనైతే శార్దూల్ ఠాకూర్ నే ఆడించాలని భావిస్తున్నాను. ఎందుకంటే అతడు బ్యాట్ తో కూడా రాణించగలడు. దాంతో భారత బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుంది. అంతేగాక అవసరమైనప్పుడు వికెట్లు కూడా పడగొడుతాడు. కావున నేను భువి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడాలనే భావిస్తున్నాను’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి: T20 Worldcup: కోహ్లీ.. ఆ ముగ్గురిని ఆడించు..! కివీస్ తో పోరుకు ముందు భారత సారథికి పాక్ మాజీ కెప్టెన్ సూచన
T20 Worldcup: కీలక సమరం.. ఎవరిని వరించేనో విజయం..? నేడే భారత్-కివీస్ నాకౌట్ పోరు..
భువనేశ్వర్ అనుభవజ్ఞుడైన బౌలరే అయినప్పటికీ.. తుది జట్టులో బ్యాలెన్స్ అవసరమని లక్ష్మణ్ చెప్పాడు. ‘అతడు (భువనేశ్వర్) అనుభవజ్ఞుడైన బౌలరే. కానీ మీరు టీమ్ బ్యాలెన్స్ ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం నేనైతే శార్ధూల్ ఠాకూర్ కే ఓటువేస్తాను’ అని అభిప్రాయపడ్డాడు.
కాగా.. కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న భువీ.. పాకిస్థాన్ (Pakistan) తో మ్యాచ్ లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో మూడు ఓవర్లే వేసిన భువీ.. 25 పరుగులిచ్చాడు. మరోవైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్ (IPL) లో కూడా అంతగా ఆకట్టుకోలేదు. పాక్ తో మ్యాచ్ అనంతరం అతడిని తుది జట్టులోంచి తప్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి. మరి కీలకమైన భారత్-న్యూజిలాండ్ పోరు ముందు విరాట్.. భువీని పక్కనబెడుతాడా..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.