T20 Worldcup: మైదానంలో గొడవపడ్డ బంగ్లా, లంక క్రికెటర్లు.. జరిమానా విధించిన ఐసీసీ
ICC T20 Worldcup2021:ఆదివారం బంగ్లాదేశ్, శ్రీలంక ల మధ్య జరిగిన మూడో గ్రూప్ మ్యాచ్ లో బంగ్లా ఆటగాడు లిటన్ దాస్, లంక బౌలర్ లహిరు కుమార ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ నువ్వెంత.? అంటే నువ్వెంత..? అనుకున్నారు.
సాధారణంగా రెండు దేశాల మధ్య వన్డే, టెస్టు సిరీస్ లు జరిగేతేనే ఆటగాళ్ల ఎమోషన్స్ హై లో ఉంటాయి. మైదానంలో పలువురు ఆటగాళ్లు దూకుడు మీద ఉంటారు. అవతలి వాళ్ల ప్రవర్తన కొంచెం శ్రుతి మించినట్టు అనిపిస్తే చాలు.. వాళ్లపై మాటల యుద్ధానికి దిగుతారు. మామూలు సమయాల్లోనే ఇలా ఉంటే ఇక ధనాధన్ యుద్ధంలో ఇంకే రేంజ్ లో ఉండాలి. నిన్న బంగ్లాదేశ్, శ్రీలంక (Bangladesh vs Srilanka)ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా అదే జరిగింది.
ఆదివారం బంగ్లాదేశ్ (bangladesh), శ్రీలంక (Srilanka) ల మధ్య జరిగిన మూడో గ్రూప్ మ్యాచ్ లో బంగ్లా ఆటగాడు లిటన్ దాస్ (Liton Das), లంక బౌలర్ లహిరు కుమార (Lahiru kumara) ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ నువ్వెంత.? అంటే నువ్వెంత..? అనుకున్నారు. కొట్టుకోవడమొకటే తక్కువ గానీ, ఇరుజట్ల సహచరులు అడ్డుకోకపోతే అది కూడా జరిగేదే.
అసలేం జరిగిందంటే.. తొలుత టాస్ గెలిచిన లంక బౌలింగ్ ఎంచుకుంది. లాహిరు వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ ఔటయ్యాడు. ఈ క్రమంలో కుమార.. దాస్ వైపునకు చూస్తూ మాటలు తూటాలు పేల్చాడు. మరి దాస్ ఏమైనా తక్కువ తిన్నాడా..? తాను కూడా కుమారతో వాదనకు దిగాడు.
ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు తోసుకోబోయేదాకా వచ్చింది గొడవ. దీంతో అక్కడే ఉన్న ఇరు జట్ల సహచరులు, ఫీల్డ్ అంపెర్లు కలుగజేసుకుని వాళ్లను అడ్డుకున్నారు. ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దాస్ తో గొడవ కంటే ముందు కుమార.. నయీమ్ తో కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నయీమ్ కొట్టిన బంతిని అందుకుని అతడిమీదకే విసిరాడు. ఇదే ఇప్పుడు అతడి కొంపముంచింది.
కుమార, దాస్ లు చేసిన దానిని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ-ICC) సీరియస్ గా తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన ఐసీసీ క్రమశిక్షణ కమిటీ.. వీరిరువురికీ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనావళిని (ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ - ICC Code Of conduct) ఆర్టికల్ 2.5 (మాటలతో గానీ, సంజ్ఞలతో గానీ ఇతర ఆటగాళ్లను దూషించడం) ని ఉల్లంఘించినందుకు గాను అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేగాక ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేసింది.
ఇక దాస్.. ఆర్టికల్ 2.20 (ఆట స్ఫూర్తిని దెబ్బతీసినందుకు) ని అతిక్రమించినందుకు గాను మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత తో పాటు 1 డీమెరిట్ పాయింట్ వేసింది. ఈమేరకు భారత మాజీ పేసర్, ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ టోర్నీలకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న జవగళ్ శ్రీనాథ్ ఆదేశాలు జారీ చేశాడు.