ICC T20 WorldCup: ప్రపంచకప్ లోనూ డీఆర్ఎస్.. కానీ రెండే ఛాన్సులు.. ఐసీసీ కీలక నిర్ణయం
T20 World Cup: ఈనెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ మొదలుకానున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది.
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న T20 worldcup వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నది. ఈనెల 17 నుంచి నవంబర్ 14 దాకా జరుగనున్నది. ఇప్పటికే Ipl2021 సందర్భంగా పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఇప్పటికే దుబాయ్ లో మకాం వేశారు. అయితే ఈ మెగా టోర్నీలో డిసీషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ఉంటుందా..? లేదా..? అనేదానిపై అనుమానాలు తొలిగిపోయాయి.
అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) డీఆర్ఎస్ పై కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రతి జట్టు ఇన్నింగ్స్ లో రెండు సార్లు డీఆర్ఎస్ ను వాడుకోవచ్చు. ఈ విషయాన్ని ఐసీసీ సీఈవో జియోఫ్ అలర్డైస్ ఆదివారం తెలిపాడు.
ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘కొవిడ్ కారణంగా డ్యూటీ అంపైర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఫీల్డ్ లో ఉన్న అంపైర్ల మీద ఒత్తిడి తగ్గించడంతో పాటు ఆటగాళ్ల అభ్యర్థనల కోసం డీఆర్ఎస్ ను తొలిసారిగా ప్రపంచకప్ లో ప్రవేశపెట్టబోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.
చివరిసారి టీ20 వరల్డ్ కప్ (2016) లో డీఆర్ఎస్ లేదు. ఈ సిస్టమ్ ను తొలిసారి 2018 మహిళల ప్రపంచకప్ సందర్భంగా ప్రవేశపెట్టార. కరీబియన్ దీవుల్లో జరిగిన ఆ టోర్నీలో డీఆర్ఎస్ ను ప్రవేశపెట్టినప్పుడు దీనిమీద పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత దీనిని పురుషుల వన్డే, టెస్టు మ్యాచ్ లలోనూ ప్రవేశపెట్టారు.