టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ జట్టులో చేర్చుకునేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టిింది. బెంగళూరు టీ20లో టీమిండియా ఓటమి తర్వాత మేనేజ్‌మెంట్ ఆలోచనలో మార్పు వచ్చినట్లుంది.  

ఐసిసి టీ20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియాకు మరో కొత్త సమస్య మొదలయ్యింది. అదే మిడిల్ ఆర్డర్ వైఫల్యం. గతంలోనూ ఈ సమస్య టీమిండియాను వేధించినా టాప్ ఆర్డర్ దాన్ని హైలైట్ కానివ్వలేదు. అలాగే ఈ మిడిల్ ఆర్డర్ లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు రావడం కాస్త కలిసొచ్చేది. కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సీరిస్ లో టీమిండియా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈసారి ధోని కూడా జట్టులో లేకపోవడం ఆ సమస్య తీవ్రత ఏ స్ధాయిలో వుందో అర్థమయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐసిసి వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎంఎస్ ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ధోని మాత్రం పూర్తిగా క్రికెట్ కు దూరం కాకుండా కొంతకాలం జట్టుకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమిండియా కష్టాలు మరీ ఎక్కువయ్యాయి. అతడు జట్టులో వుండగానే మిడిల్ ఆర్డర్ చాలా వీక్ గా వుండేది. టాప్ ఆర్డర్ విఫలమైతే నమ్మదగ్గ ఆటగాడు ఎవరున్నారని చూస్తే ధోని ఒక్కడే కనిపించేవాడు. అలాంటిది అతడు కూడా జట్టుకు దూరమవడంతో మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతూ వస్తోంది. 

వెస్టిండిస్ పర్యటనలో టాప్ ఆర్డర్ రాణించడంతో ఈ సమస్య బయటపడలేదు. కానీ తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా వంటి టాప్ టీంతో తలపడాల్సి వచ్చేసరికి ఇది బయటపడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు విఫలమైతే మిడిల్ ఆర్డర్ కనీస పోరాటాన్ని ప్రదర్శించడంలేదు. బెంగళూరు టీ20 ద్వారా ఇది బయటపడింది. ధోని స్థానంలో జట్టులోకి వచ్చిని రిషబ్ పంత్, విండీస్ పర్యటనలో రాణించిన శ్రేయాస్ ఆయ్యర్, పాండ్యా బ్రదర్స్, ఆలౌరౌండర్ జడేజా ఈ మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయారు. దీంతో మిడిల్ ఆర్డర్ లో ధోని లేనిలోటు స్పష్టంగా కనిపించింది. 

ఈ ఓటమితో టీమిండియా మేనేజ్‌మెంట్ లో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తోంది. వచ్చేఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 సీరిస్ లో ధోనిని కాకుండా యువ క్రికెటర్లను ఆడించాలన్నది మేనేజ్‌మెంట్ ఆలోచనగా కనిపించింది. అందుకోసం యువ క్రికెటర్లను ఎక్కువగా జట్టులోకి తీసుకుని ప్రయోగాలు చూస్తూ వస్తోంది. కానీ వారెవ్వరూ ధోని మాదిరిగా నమ్మదగిన స్థాయిలో ఆడటం లేదు. దీంతో తన ఆలోచనను మార్చుకుని ధోనిని ప్రపంచ కప్ ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.