Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: జట్టంతా సంబురాల్లో ఉంటే ఒంటరిగా కూర్చున్న నీషమ్.. పని ఇంకా మిగిలేఉందంటూ ట్వీట్

James Neesham: ఇంగ్లాండ్ పై విజయానంతరం.. సహచర ఆటగాళ్లంతా  సంబురాల్లో మునిగిపోతే.. నీషమ్ మాత్రం  ఒక్కడే కామ్ గా కూర్చున్నాడు. డగౌట్ లో నీషమ్ ఒక్కడే కూర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ICC T20 World Cup 2021: New Zealand's James Neesham sitting alone in the ground after Teammates Enjoying victory against England, pic goes Viral
Author
Hyderabad, First Published Nov 11, 2021, 3:04 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా  తొలి సెమీస్ లో న్యూజిలాండ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కివీస్ ఆటగాడు జేమ్స్ నీషమ్ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో  టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్స్ కు ప్రవేశించింది. అయితే ఇంగ్లాండ్ పై విజయానంతరం.. సహచర ఆటగాళ్లంతా  సంబురాల్లో మునిగిపోతే.. నీషమ్ మాత్రం  ఒక్కడే కామ్ గా కూర్చున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఆటగాళ్లంతా  ఇంగ్లాండ్ పై ప్రతీకార విజయాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. నీషమ్ మాత్రం సైలెంట్ గా ఉన్నట్టు  సమాచారం. డగౌట్ లో నీషమ్ ఒక్కడే కూర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బుధవారం జరిగిన తొలి సెమీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఛేదన ప్రారంభించిన న్యూజిలాండ్.. 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఆ జట్టు ఓపెనర్ డరిల్ మిచెల్.. (72 నాటౌట్), కాన్వే (46) లు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. అయితే 16 ఓవర్ల దాకా మ్యాచ్ ఇంగ్లాండ్ వైపే ఉంది. 17వ ఓవర్లో నీషమ్ వీర విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు.. ఫోర్ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా కివీస్ వైపునకు మళ్లింది. మొత్తంగా 11 బంతులాడిన నీషమ్.. మూడు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి కివీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ అయిపోయాక అందరూ విజయానందంలో గ్రౌండ్ లోకి వెళ్లి  సంబురాలు చేసుకుంటే నీషమ్ మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు. ఒకవైపు డగౌట్ లో కూర్చున్న సహచరులు.. గెలిచాక లేచి గెంతులేస్తుంటే నీషమ్ మాత్రం గంభీరంగా చూస్తూ ఉండిపోయాడు. డగౌట్ లో ఉన్నవాళ్లంతా  సంబురాలు చేసుకుంటుంటే.. ఒక్కడే కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.  

ఇది కూడా చదవండి: T20 World cup: కొత్త విజేతను చూస్తామా..? వరల్డ్ కప్ రెండో సెమీస్ లో పాక్ పై ఆసీస్ గెలిస్తే చరిత్రే..

ఇందుకు సంబంధించిన ఫోటోను ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో షేర్ చేస్తూ.. జట్టంతా సంబురాలు చేసుకుంటున్నా నీషమ్ మాత్రం డగౌట్ ను వీడలేదు అని అర్థం వచ్చే విధంగా.. ‘నీషమ్ మాత్రం కదల్లేదు’ అని ట్వీట్ చేసింది. 

 


అయితే కివీస్ ఫైనల్ కు చేరింది గానీ అక్కడ  బలమైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేడు పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న రెండో సెమీస్ లో గెలిచిన విజేతతో  ఆ జట్టు తుది పోరులో ఢీకొనబోతున్నది. ఒకవేళ పాకిస్థాన్ గెలిస్తే.. టోర్నీ తొలి మ్యాచ్ లో  తమను ఓడించిన పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు కప్పు సాధించాలని కివీస్ భావిస్తున్నది. ఇక ఆస్ట్రేలియా గెలిస్తే.. అది కివీస్ కు చిరకాల ప్రత్యర్థే. ఇరు జట్లూ బలంగానే ఉన్నాయి. దీంతో ఫైనల్స్ లో ఆసక్తికర పోరు ఖాయం. ఫైనల్స్ గెలిస్తేనే అసలైన మజా వస్తుందనే భావనలో నీషమ్ ఉన్నట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఈఎస్పీన్ క్రిక్ ఇన్ఫో ట్వీట్ కు నీషమ్ కూడా  స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. అదే పోస్టును ట్యాగ్ చేస్తూ.. ‘పని పూర్తైందా..?  ఇంకా కాలేదనే నమ్ముతున్నాను..’ అంటూ  ట్వీట్ చేశాడు.  ట్రోఫీ గెలిచేదాకా ఏ మాత్రం అలసట వద్దన్న ఉద్దేశంలో నీషమ్ పోస్టు చేశాడని  క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios