T20 World cup: ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..! టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ల దారుణమైన ట్రోలింగ్
Shahid Afridi Trolls Team India: న్యూజిలాండ్ తో పరాజయం అనంతరం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇక భారత్ సెమీస్ కు వెళ్లడం అద్భుతమే అని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి సెమీస్ పోటీ నుంచి దాదాపు నిష్క్రమించిన టీమిండియా (Team India)పై అభిమానులు, సొంతగడ్డకు చెందిన సీనియర్ క్రికెటర్లే కాదు.. ఇతర దేశాల ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan) ఆటగాళ్లయితే సంబురాలు చేసుకోవడం ఒకటే తక్కువ. సరిగ్గా వారం రోజుల క్రితం పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత హద్దు మీరి ప్రవర్తించిన పాక్ ఆటగాళ్లు.. తాజాగా నిన్న న్యూజిలాండ్ తో మ్యాచ్ ముగిశాక కూడా అవే కామెంట్స్ చేస్తున్నారు.
న్యూజిలాండ్ (Newzealand)తో పరాజయం అనంతరం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది (Shahid Afridi) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇక భారత్ సెమీస్ కు వెళ్లడం అద్భుతమే అని పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్ లలో భారత ఆటతీరును చూసినవారికి ఈ డౌట్ రావడం సహజమే అని కామెంట్స్ చేశాడు.
అఫ్రిది స్పందిస్తూ.. ‘భారత్ కు ఇంకా సెమీస్ కు అర్హత సాధించే అవకవాశం ఉంది. కానీ ఈ టోర్నీలో గత రెండు మ్యాచులను వాళ్లు ఎలా ఆడారో చూస్తే మాత్రం.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మరొకటి (భారత్ సెమీస్ కు చేరడం) కాదు’ అంటూ ట్వీట్ చేశాడు.
ఇక భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ పై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ కూడా స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఇంజమామ్ మాట్లాడుతూ.. ‘ఇండియా-పాకిస్థాన్ తర్వాత ఈ టోర్నీలో ఇదే పెద్ద మ్యాచ్. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య పోరు కంటే ఇదే ఇంట్రెస్టింగ్ మ్యాచ్. కానీ.. ఎంతో ముఖ్యమైన మ్యాచ్ లో టీమిండియా ఆడిన విధానం నన్ను విస్మయానికి గురి చేసింది. అసలు వాళ్లు ఏం చేశారో నాకు అర్థం కాలేదు. అంత పెద్ద జట్టు ఇంత ఒత్తిడికి గురవడమేమిటో నాకస్సలు అర్థం కాలేదు’ అన్నాడు. న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన ఓడిపోవడం తనను షాక్ కు గురి చేసిందని చెప్పాడు.
ఇంకా అతడు మాట్లాడుతూ.. న్యూజిలాండ్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయగలిగారు. కానీ ప్రపంచస్థాయిలో కాదు. అయితే టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి బౌలింగ్ లో కూడా సింగిల్స్ కూడా తీయలేకపోయారు’ అని అన్నాడు. స్పిన్ బౌలింగ్ లో బాగా ఆడటమే కోహ్లి బలం. కానీ తను కూడా సింగిల్స్ తీయకపోవడం దారుణమని అన్నాడు.