భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టైటిల్ హాట్ ఫేవరేట్‌లలో ఒకరైన న్యూజిలాండ్‌ ఘోర పరాజయం పాలైంది. కివీస్‌పై 190 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు తన తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, శ్రీలంకలతో తలపడనుంది.  

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టైటిల్ హాట్ ఫేవరేట్‌లలో ఒకరైన న్యూజిలాండ్‌ ఘోర పరాజయం పాలైంది. కివీస్‌పై 190 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కీవీస్ బ్యాట్స్‌మెన్‌లలో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) పరుగులు చేశారు. భీకర ఫాంలో వున్న డేవాన్ కాన్వే (2), రచీన్ రవీంద్ర (9), టామ్ లేథమ్ (4), మిచెల్ శాంట్నర్ (7), జేమ్స్ నీషమ్ (0)లు ఘోరంగా విఫలమయ్యారు. అటు సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 4, మార్కో జాన్సన్ 3, గెరాల్డ్ కోయెట్జీ 2, రబాడా ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సఫారీ బ్యాట్స్‌మెన్లు కీవీస్ బౌలర్లను ఊచకోత కోశారు. క్వింటన్ డికాక్ (114) మరోసారి సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అతనికి ఇది నాలుగో శతకం. వాండర్ డసెన్ (133), డేవిడ్ మిల్లర్ (53), తెంబా బావుమా (24) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. కివీస్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. వరుస విజయాలతో జోరు మీదున్న ఆ జట్టును ఆస్ట్రేలియా, భారత్, తాజాగా దక్షిణాఫ్రికాలు ఓడించాయి. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు తన తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, శ్రీలంకలతో తలపడనుంది.