WTC Finals: భారత్ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ సేకు చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) కి అర్హత సాధిస్తుంది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు అర్మత సాధిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ లో తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్తుందా..? లేదా..? అనేది టీమిండియా ఫ్యాన్స్ తో పాటు ఇతరుల్లో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకవేళ భారత్ ఓడితే శ్రీలంక ఫైనల్ చేరే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాలుగో టెస్టులో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం భారత జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. వీరితో ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో కూడా ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడేది టీమిండియానే...
శ్రీలంకకు ఛాన్సు ఉన్నా అవి చాలా పరిమితం. న్యూజిలాండ్ ను వారి స్వంత గడ్డమీద రెండు టెస్టులలో గెలిచి సిరీస్ వైట్ వాష్ చేయడం చాలా కష్టం...’అని చెప్పాడు. ప్రస్తుత పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీలో బెర్త్ ఖాయం చేసుకోగా రెండో స్థానం కోసం భారత్, శ్రీలంక పోటీపడుతున్నాయి. అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా రోహిత్ సేన.. జూన్ లో ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. కానీ ఓడినా, డ్రా అయినా.. అదే క్రమంలో శ్రీలంక న్యూజిలాండ్ ను తొలి టెస్టులో ఓడించినా భారత్ కు కష్టకాలమే..
పాయింట్లు ఇలా..
ఇండోర్ టెస్టులో భారత్ ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీలో ఇదివరకే తమ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఆ తర్వాత రేసులో ఇండియా, శ్రీలంక లు ఉన్నాయి. భారత్.. 17 టెస్టులలో 10 విజయాలు ఐదు ఓటములతో 123 పాయింట్లు సాధించి ఫైనల్ చేరేందుకు 60.29 శాతం అవకాశాలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక.. 10 టెస్టులలో ఐదు గెలిచి నాలుగు ఓడి 64 పాయింట్లు సాధించి ఫైనల్ కు వెళ్లడానికి 53.33 శాతం ఛాన్స్ తో ఉంది.
భారత్ ఫైనల్ వెళ్లాలంటే..
- అహ్మదాబాద్ టెస్టు గెలిస్తే మిగతా సమీకరణాలేమీ అవసరం లేకుండా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు.
- ఒకవేళ ఈ టెస్టులో ఓడినా, డ్రా అయినా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ పాయింట్స్ పర్సంటేజ్ 52.9కు పడిపోతుంది. కానీ అయినా ఫైనల్ చేరొచ్చు.
- ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్.. సిరీస్ ను వైట్ వాష్ (రెండు టెస్టులు) కాకుండా చూసుకోవాలి. ఒక్క టెస్టు మాత్రమే శ్రీలంక గెలిచి మరొకటి డ్రా అయినా భారత్ ఫైనల్ చేరుతుంది.
శ్రీలంక ఫైనల్ చేరాలంటే..
- ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత్ ఓడిపోవాలి లేదా మ్యాచ్ డ్రా కావాలి.
- భారత్ ఓడితే శ్రీలంక న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ గెలిస్తే (1-0తో అయినా అవకాశాలుంటాయి) చాలు.
- ఒకవేళ భారత్ మ్యాచ్ ను డ్రా చేసుకుంటే అప్పుడు శ్రీలంక.. న్యూజిలాండ్ ను 2-0తో ఓడించాలి. అప్పుడే ఫైనల్ చేరడానికి ఛాన్స్ ఉంటుంది.
