Master blaster Sachin Tendulkar: 'ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నా' అంటూ తన తండ్రిని తలచుకుంటూ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ అయ్యారు. తనకు స్ఫూర్తిగా నిలిచారని భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.
Sachin Tendulkar emotional post: భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక గొప్ప విందు అని చెప్పాలి. క్రికెట్ ప్రపంచంలో గాడ్ గా కీర్తిని సాధించిన సచిన్ కు భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. సచిన్, సచిన్.. అంటూ చాలా మంది తమ పిల్లలకు క్రికెట్ పాఠాలు కూడా చెప్పారు. ఈ రంగంలో ఆయన ఇంతలా ఎదగడానికి తనలో స్ఫూర్తిని నింపిన వ్యక్తి తన తండ్రి అని చాలా సార్లు చెప్పారు. తన తండ్రి రమేష్ టెండూల్కర్ పుట్టిన రోజు కావడంతో ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సచిన్ టెండూల్కర్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన సచిన్.. 'మా నాన్న గొప్ప సంరక్షకుడు, ఆయన ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. నా జీవితంలో నేను ఏమి చేయాలనుకుంటున్నానో ఎంచుకోవడానికి నాకు స్వేచ్ఛను ఇచ్చారు. నా కలలను నెరవేర్చుకోవాలనే నా తపనలో బేషరతుగా నాకు మద్దతు ఇచ్చారు. పిల్లలందరినీ పెంచి పెద్ద చేశారు... ఆయన మాకు ఎప్పుడూ ఎంతో ప్రేమను, స్వేచ్ఛను ఇచ్చారు. తండ్రి అంటే ఏంటో నేర్పే పాఠాల్లో ఒకటి మా నాన్న. అతని ఆలోచన అతని కాలం కంటే ముందు ఉంటుంది. నేను ఆయన్ను అంతగా ప్రేమించడానికి మిలియన్ల కారణాలలో ఇది ఒకటి. వాళ్ల వల్లే నేను ఉన్నాను. హ్యాపీ బర్త్ డే డాడీ, ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాను' అంటూ సచిన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారీ రికార్డులు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మన్ సచిన్. 200 టెస్టుల్లో 15921 పరుగులు, 463 వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే సచిన్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పటికీ ముంబై ఫ్రాంచైజీ కానీ, సచిన్ కానీ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత దిగ్గజ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కూడా ముంబై జట్టు మెంటార్ పదవి నుంచి తప్పుకోవడం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సచిన్ టెండూల్కర్ 2008లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆటగాడిగా చేరి 2013 వరకు ఆ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ముంబై జట్టు అతనికి మెంటార్ బాధ్యతలను అప్పగించింది. ఆరేళ్ల పాటు ఐపీఎల్లో ముంబై తరఫున ఆడిన సచిన్ 78 మ్యాచ్ల్లో 2334 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ 295 ఫోర్లు, 29 సిక్సర్లు బాదాడు.
