ఆ ఫోటోలను వాడిన కోహ్లి.. స్పందించిన ఫోటోగ్రాఫర్.. ఏమన్నాడంటే..
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి లీస్టర్షైర్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ ఫర్వాలేదనిపించాడు. తాజాగా అతడు తన ట్విటర్ ఖాతా వేదికగా పలు ఫోటోలు షేర్ చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించాడు. రెండు ఇన్నింగ్స్ లలో అతడు 33, 67 పరుగులతో మెరిశాడు. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి ట్విటర్ వేదికగా ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఫోటోలను షేర్ చేస్తూ కోహ్లి.. ‘థాంక్యూ లీస్టర్షైర్. బర్మింగ్ హోమ్ ఎదురుచూస్తున్నది..’ అని ట్వీట్ చేశాడు.
అయితే కోహ్లి చేసిన పోస్టు పై తాజాగా ఆ ఫోటోలను తీసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ స్పందించాడు. లీస్టర్షైర్ జట్టుకు అఫిషీయల్ ఫోటోగ్రాఫర్ గా ఉన్న జాన్ మాలెట్.. కోహ్లి ట్విటర్ పోస్టుకు స్పందించాడు.
జాన్ మాలెట్ స్పందిస్తూ.. ‘ప్రపంచంలోని అత్యంత గొప్ప ప్లేయర్లలో ఒకడైన ఆటగాడు తన వ్యక్తిగత మీడియా ఖాతాలలో నా చిత్రాలలో కొన్నింటిని ఉపయోగించాలని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఫోటోలను క్యాప్చర్ చేసినందుకు గర్వంగా ఉంది. విరాట్ కోహ్లి, బీసీసీఐకి థాంక్యూ. మీ మద్దతు ఇలాగే కొనసాగాలి..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
సుదీర్ఘ కాలంగా ఐటీ, ఇన్సూరెన్స్ కంపెనీలలో పనిచేసిన మాలెట్.. ఫోటోగ్రఫీని తన కెరీర్ గా ఎంచుకున్నాడు. ఫోటోగ్రఫీలో ఆసక్తి మీద కలిగిన అతడు.. కొద్దికాలం తర్వాత లీస్టర్షైర్ ఫాక్స్ పోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఇదిలాఉండగా.. బర్మింగ్హోమ్ లోని ఎడ్జబాస్టన్ వేదికగా జులై 1 నుంచి జరుగబోయే ఐదో టెస్టుకు కోహ్లి సిద్ధమవుతున్నాడు. ఈ టెస్టుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ ను తుది జట్టులోకి బ్యాకప్ గా తీసుకున్నారు. అతడితో పాటు ఇంగ్లాడ్ జట్టులో కూడా వికెట్ కీపర్ గా బెన్ ఫోక్స్ కూడా కరోనా బారిన పడటంతో ఈ టెస్టు జరిగేది అనుమానమే ఉంది. ఐదో టెస్టు ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయముంది. ఇప్పటికైతే రోహిత్ తో పాటు ఫోక్స్ ఈ టెస్టు నాటికల్లా కోరుకుంటారని చెబుతున్నా అది అనుమానమే. వీరితో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడితే ఇక అంతే సంగతులు.