INDvsAUS 4th Test: భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు రికార్డులు సృష్టిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో జనజాతర జరుగుతోంది.
టెస్టు మ్యాచ్ లకు క్రేజ్ తగ్గిపోతున్న వేళ వీటిని చూడటానికి జనం నానాటికీ తగ్గిపోతున్నారని ఐసీసీతో పాటు క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ అహ్మదాబాద్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రికార్డులు సృష్టిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను నరేంద్ర మోడీ స్టేడియానికి లక్ష మందికి పైగా వచ్చారని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
నాలుగో టెస్టు ప్రారంభం సందర్భంగా నేడు ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ లు మ్యాచ్ చూసేందుకు వచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ లో మోడీ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మోడీ మేనియానో మరేదో గానీ అహ్మదాబాద్ స్టేడియంలో తొలి రోజు నమోదైన రికార్డులు 144 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రను తిరిగరాశాయి.
గతంలో 2013 లో ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ నడుమ 2013లో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టును వీక్షించేందుకు గాను తొలి రోజు 91,092 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ తొలి రోజు మెల్బోర్న్ రికార్డును బ్రేక్ చేసింది. ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో 2022లో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కూడా లక్షకు పైగా జనం హాజరయ్యారు. ఇందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు బీసీసీఐ సెక్రటరీ జై షాకు పురస్కారాన్ని కూడా అందజేసిన విషయం తెలిసిందే. అయితే నేడు వచ్చిన వారి పూర్తి సంఖ్య తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలాఉండగా ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా మూడో సెషన్ లో 80 ఓవర్లు ముగిసేనాటికి 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (32), స్టీవ్ స్మిత్ (38) లతో పాటు పీటర్ హ్యాండ్స్కాంబ్ (17), లబూషేన్ (3) లు పెవిలియన్ కు చేరారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (86 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (11 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.
