T20 World Cup: అతడుంటే చాలు.. కప్ మాదే..! ధోని నియామకంపై భారత కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli on MS Dhoni: భారత క్రికెట్ గతిని మార్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేటి నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ లో ఇండియాకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు. ధోని తిరిగి భారత జట్టులో చేరడంపై విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) తిరిగి జట్టుతో చేరడం పట్ల ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) సంతోషం వ్యక్తం చేశాడు. నేటి నుంచి యూఏఈ వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ (T20 world cup)లో ధోని రాక తమకు సగం పనిభారాన్ని తగ్గించినట్టే అని చెప్పకనే చెప్పాడు. ధోని తనకు గురువు సమానుడని.. అంతటి ఆటగాడి అనుభవం నవతరం క్రికెటర్లకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు.
టోర్నీ ప్రారంభం సందర్భంగా విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. ‘ధోని తిరిగి డ్రెస్సింగ్ రూమ్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. తన కొత్త పాత్రను పోషించడానికి అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మేమంతా కెరీర్లు ఆరంభించిన దశలో ధోని మాకు మార్గనిర్దేశకుడి (Mentor) పాత్ర పోషించాడు. ఇదే అవకాశం యువ ఆటగాళ్లకు కూడా లభించనుంది. ధోని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని అన్నాడు.
ఇది కూడా చదవండి: MS Dhoni: అలా చేయాల్సి వస్తే మొదటి పేరు ధోనిదే.. చెన్నైలో కెప్టెన్ కూల్ భవితవ్యంపై తేల్చేసిన యాజమాన్యం
ఇంకా కోహ్లి స్పందిస్తూ.. ‘ధోని ఏ జట్టులో నాయకత్వ పాత్రను పోషించినా అతడు తేడాను చూపుతాడు. ఫీల్డ్ లో అతడు మాతో ఉండటం మాకు కలిసొచ్చేదే. ధోని కచ్చితంగా ఈ జట్టు ధైర్యాన్ని పెంచుతాడు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పటికప్పుడు మాకు సలహాలిస్తాడు. ధోని మాతో ఉన్నాడన్న మాటే మాకు కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తున్నది. ఈసారి కప్ కొడతామనే ధీమా ఉంది’ అని వివరించాడు.
ఇక గత రెండు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ గురించి మాట్లాడుతూ.. ‘2016లో మేం టోర్నీ నుంచి నిష్క్రమించడం నిరాశపరిచింది. ఆ టోర్నీలో వెస్టిండీస్ అద్భుతంగా ఆడింది. విజయానికి వాళ్లు పూర్తి స్థాయిలో అర్హులు. ఇక 2014 శ్రీలంకతో ఫైనల్స్ లో మేం ఓడిపోవడంతో చాలా మందితో పాటు నాకు విచారకరం. అది మాకు చాలా గుణపాఠాలు నేర్పింది’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: మరొకరి భార్యను పెళ్లి చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగిన కుంబ్లే.. జంబో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తెలుసా..?
కాగా, ప్రపంచకప్ లో భాగంగా భారత్ ఈనెల 18, 20న ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. ఇక ఈనెల 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (India vs Pakistan)తో తలపడబోతుంది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ గురించి కూడా కోహ్లి మాట్లాడాడు. అన్ని మ్యాచ్ ల మాదిరిగానే దీనిని కూడా ఓ సాధారణ మ్యాచ్ గానే చూస్తామని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్ మధ్య చాలా హైప్ ఉన్నా.. తాము మాత్రం వీలైనంత ప్రొఫెషనల్ గా ఆడటానికే యత్నిస్తామని చెప్పాడు.