Independence Day 2022: దేశం పేరును మార్చండి : మోడీ, అమిత్ షాలను కోరిన షమీ భార్య
Hasin Jahan: భారత క్రికెట్ జట్టు వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహన్ మరోసారి వార్తల్లో నిలిచింది. దేశం పేరును మార్చాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కోరింది.
దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహన్ సంచలన కామెంట్స్ చేసింది. దేశం పేరును మార్చాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను కోరింది. ప్రస్తుతమున్న ‘ఇండియా’తో దేశానికి రావాల్సిన గుర్తింపు దక్కడం లేదని, అలా కాకుండా ‘భారత్’ లేదా ‘హిందూస్తాన్’ అని పిలిచేలా పేరులో మార్పులు చేయాలని హసిన్ జహన్ కోరింది.
ఆగస్టు 15న స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హసిన్ జహన్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో హసిన్ తో పాటు సంతల్య్, సోనియాలతో కలిసి ఆమె ప్రముఖ బాలీవుడ్ గీతం ‘దేశ్ రంగీలా’ పాటకు నృత్యం చేసింది.
ఈ సందర్బంగా ఆమె.. ‘‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మనదేశం పేరు ‘భారత్’ అని గానీ ‘హిందూస్తాన్’ అని గానీ ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం మనం పిలుస్తున్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ అని గానీ, ‘హిందుస్తాన్’ అని గానీ పెట్టండి. అప్పుడు ప్రపంచం మొత్తం మనను అదే పేరుతో పిలుస్తుంది..’ అని రాసుకొచ్చింది.
దేశం 75వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ హసిన్ చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఆమె చేసిన ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాకపోయినప్పటికీ దేశం సంబురాలు చేసుకుంటున్న ఈ తరుణంలో అవసరమా..? అని కొంతమంది కామెంట్ చేస్తుండగా మరికొందరు ఆమె పోస్టును సమర్థిస్తున్నారు.
ఇదిలాఉండగా 2014లో పెళ్లి బంధంతో ఒక్కటైన షమీ - హసిన్ లు 2018 నుంచి దూరంగా ఉంటున్నారు. తనపై లైంగిక వేధింపులతో పాటు ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని హసిన్ ఆరోపించింది. అప్పట్నుంచి ఈ ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదు. ప్రస్తుతం హసిన్ మోడలింగ్ మీద దృష్టి సారించగా షమీ టీమిండియా షెడ్యూల్స్ తో బిజీగా గడుపుతున్నాడు.