ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా
హర్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించారు.
![hardik pandya hasbeen named the captain fo mumbai indians for ipl 2024 lns hardik pandya hasbeen named the captain fo mumbai indians for ipl 2024 lns](https://static-ai.asianetnews.com/images/01hg2ff5b5m67833wpxwk8a4pp/hardik-pandya-jpg_363x203xt.jpg)
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఈ నెల ప్రారంభంలో గుజరాత్ టైటాన్ నుండి ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి హర్ధిక్ పాండ్యా వచ్చాడు. గతంలో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండేవాడు. 2013, 2015, 2017, 2019, 2020లలో ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది.ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హర్ధిక్ పాండ్యాను ప్రకటించడం వ్యూహాత్మక ఎత్తుగడను సూచిస్తుంది.
సచిన్ నుండి హర్భజన్ వరకు, రికీ నుండి రోహిత్ వరకు తక్షణ విజయానికి దోహదం చేస్తూ భవిష్యత్తు కోసం జట్టును బలోపేతం చేయడంపై దృష్టి ఉంటుందని జట్టు మేనేజ్ మెంట్ పేర్కొంది.ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ జట్టుకు హర్ధిక్ పాండ్యాను కెప్టెన్సీగా తీసుకున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి
ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టుకు అసాధారణ విజయాలు అంధించిన రోహిత్ శర్మకు కూడ జట్టు మేనేజ్ మెంట్ ధన్యవాదాలు తెలిపింది. రోహిత్ శర్మ అనుభవం, మార్గదర్శకత్వం ముంబై ఇండియన్స్ నిరంతర విజయానికి గణనీయంగా దోహదపడుతుందని ప్రముఖ క్రికెటర్ మహేలే జయవర్ధనే అభిప్రాయపడ్డారు.హర్ధిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమితులైనందుకు జయవర్ధనే శుభాకాంక్షలు తెలిపారు. సమర్ధవంతమైన బ్యాటింగ్, బౌలింగ్ కు పాండ్యా పేరు పొందారు. ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ జట్టును హార్ధిక్ పాండ్యా ఎలా నడిపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
2013లో రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ పేలవమైన ఆరంభాన్ని ప్రారంభించింది. అయితే ఆ తర్వాత రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ ఆశ్రయించింది. ముంబై ఇండియన్స్ జట్టును ఐపీఎల్ లో విజయాల బాట వైపు నడిపించడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
రెండు సీజన్ల క్రితం ముంబై ఇండియన్స్ నుండి గుజరాత్ టైటాన్స్ కు హర్ధిక్ పాండ్యా వెళ్లారు. కొత్త ప్రాంచైజీని ఐపీఎల్ సీజన్ లో టైటిల్ వైపునకు నడిపించడంలో పాండ్యా కీలకంగా వ్యవహరించారు. 2015లో ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం మొదలైందని హార్ధిక్ పాండ్యా గుర్తు చేసుకున్నారు.