టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ క్లీయర్ చేసిన ఆ ఇద్దరు..!
India T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు శుభవార్త. ఆసియా కప్ లో గాయపడ్డ ఇద్దరు కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ టెస్ట్ సాధించారు.
ఆసియా కప్ -2022లో గాయం కారణంగా ఆడలేకపోయిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మీడియం పేసర్ హర్షల్ పటేల్ లు టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఫిట్నెస్ టెస్టు ఇంకా క్లీయర్ కాకపోవడంతో ఈ ఇద్దరూ అక్టోబర్ లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ఆడతారా..? లేదా..? అన్న అనుమానానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా అందుతున్న రిపోర్టుల ప్రకారం బుమ్రా, హర్షల్ లు ఫిట్నెస్ టెస్టులో పాసయ్యినట్టు తెలుస్తున్నది. దీంతో ఈ ఇద్దరూ టీ20 ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాల పుష్కలంగా ఉన్నాయి.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఈ ఇద్దరికీ శనివారం ఫిట్నెస్ టెస్టు పూర్తైనట్టు సమాచారం. ఈ టెస్టులో బుమ్రా, హర్షల్ లు తమ ఫిట్నెస్ ను నిరూపించుకున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఇద్దరి ఫిట్నెస్ పట్ల టీమిండియా వైద్యసిబ్బంది పూర్తి సంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
బుమ్రా, హర్షల్ లు ఫిట్నెస్ సాధించడంతో ఈ ఇద్దరూ ఈ నెల 15,16 తేదీలలో బీసీసీఐ సెలక్టర్లు వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేయబోయే జట్టుకు అందుబాటులో ఉంటారు. అయితే వీరిని టీ20 జట్టుకు ఎంపిక చేసినా వచ్చే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో ఆడిస్తారా..? లేదా..?అనేది అనుమానమే. బుమ్రా ను ఆడించకపోయినా హర్షల్ ను మాత్రం దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆడించాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నది. హర్షల్ ఫిట్నెస్ సాధించినా అతడు ఎలా ఆడతాడు..? పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించాడా..? లేదా..? అనేది పరీక్షించనున్నారు.
వాళ్లిద్దరూ వస్తే ఎవరు ఔట్..?
టీ20 ప్రపంచకప్ లో బుమ్రా, హర్షల్ ను ఎంపిక చేస్తే ఆసియా కప్ లో ఆడిన యువ పేసర్ అవేశ్ ఖాన్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్ తో పాటు మహ్మద్ షమీలను కూడా ఎంపిక చేయాలని భావిస్తే అర్ష్దీప్ సింగ్ ఆడేది అనుమానమే. ఆసియా కప్ లో భారత జట్టు ప్రతీ మ్యాచ్ లోనూ ప్రయోగాలు చేసింది. కానీ అవన్నీ విఫల ప్రయోగాలు అయ్యాయి. దీంతో ఈసారి జట్టును ఆచితూచి ఎంపిక చేయాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.