పింక్‌ టెస్టుకి ముందు గ్లెన్ మెక్‌గ్రాత్‌కి కరోనా పాజిటివ్.. ఆన్‌లైన్ ద్వారా ప్లేయర్లకు పింక్ క్యాపులు అందచేయనున్న మెక్‌గ్రాత్... ఇంగ్లాండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌కి కరోనా...

యాషెస్ సిరీస్‌లో సిడ్నీలో జరిగే పింక్ టెస్టు కోసం ఎదురుచూస్తున్న ఇరు జట్లకి ఊహించని షాక్ తగిలింది. సిడ్నీలో పింక్ టెస్టు నిర్వహిస్తున్న ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కరోనా బారిన పడ్డాడు. ప్రతీ యేటా జనవరి మాసంలో జరిగే మొదటి టెస్టును పింక్ టెస్టుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది...

బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 2008లో ప్రాణాలు కోల్పోయిన గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జాన్‌‌కి నివాళిగగా ప్రతీయేటా మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిడ్నీ టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే ప్లేయర్లు, ప్రేక్షకులు పింక్ కలర్ బ్యాడ్‌లతో హాజరు అవుతారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల చికిత్స కోసం వాడతారు...

యాషెస్ సిరీస్‌లో భాగంగా జనవరి 5 మొదలయ్యే సిడ్నీ టెస్టు పింక్ టెస్టుగా పిలవబడితే, ఈ మ్యాచ్‌లో మూడో రోజును ‘జాన్ మెక్‌గ్రాత్ డే’గా పిలుస్తారు. పింక్ టెస్టులో పాల్గొనే ప్లేయర్లకు గ్లెన్ మెక్‌గ్రాత్ స్వయంగా పింక్ క్యాపులు అందించడం ఆనవాయితీ...

అయితే సిడ్నీ టెస్టుకి ముందు అతను కరోనా పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌కి నేరుగా హాజరుకావడం లేదు. అయితే ఆన్‌లైన్ ద్వారా ఈ మ్యాచ్‌ ప్రారంభోత్సవాన్ని వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించబోతున్నాడు. 

‘గ్లెన్ మెక్‌గ్రాత్‌కి చేసిన పీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను, అతని కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. క్రికెట్ ఆస్ట్రేలియా, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కి మేం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ టెస్టు మ్యాచ్‌ని పింక్ మయం చేయడంంలో ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ సహకారం కూడా మరవలేనిది...’ అంటూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ చీఫ్ ఎడ్జిక్యూటివ్ హోలీ మాస్టర్స్ తెలియచేసింది...

ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లో చిత్తుగా ఓడి, యాషెస్ టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకి సిడ్నీ టెస్టుకి ముందు ఊహించని షాక్ తగలింది. ఇంగ్లాండ్ టీమ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ కరోనా పాజిటివ్‌‌గా తేలాడు. దీంతో సిడ్నీ టెస్టు మ్యాచ్‌కి గ్రాహం తోర్ప్‌ ప్రధాన కోచ్‌‌గా వ్యవహరించబోతున్నాడు...

గత 9 నెలలుగా సరైన విజయాలు అందుకోలేకపోతున్న ఇంగ్లాండ్ జట్టు, 2021 ఫ్రిబవరి నుంచి కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే విజయాలు అందుకుంది. శ్రీలంకలో వరుసగా రెండు టెస్టులు నెగ్గిన ఇంగ్లాండ్, ఆ తర్వాత చెన్నైలో భారత్‌పై విజయం సాధించింది. సెప్టెంబర్‌లో లీడ్స్‌లో జరిగిన టెస్టులో భారత జట్టు విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఓ టెస్టు, టీమిండియా చేతుల్లో ఐదు టెస్టులు ఓడింది...

యాషెస్ సిరీస్‌లోనూ కనీస పోరాటం కూడా చూపించకుండా చేతులేత్తేస్తోంది ఇంగ్లాండ్ జట్టు. దీంతో యాషెస్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌తో పాటు టెస్టు కెప్టెన్‌గా జో రూట్‌ను తప్పిస్తూ... ఆ ఇద్దరిపై వేటు వేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇంగ్లాండ్ తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరు? అనే విషయంపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది.