పూయనైతే పూశారు గానీ ఇది ఇంకా పోవడంలే.. ఎవరైనా హెల్ప్ చేయండి.. పాపం ఆర్సీబీ పాపకు హోలి కష్టాలు..
WPL 2023: గతవారం హోలి సందర్భంగా తన జుట్టుకు అంటుకున్న రంగు ఇంకా పోలేదని.. దానిని వదిలించుకునేందుకు ఎవరైనా చిట్కాలు చెప్పాలని పెర్రీ అభ్యర్థిస్తోంది.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నది. అటు బంతితో పాటు బ్యాట్ తో కూడా రాణిస్తోంది. ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడినా పెర్రీ మాత్రం ఆకట్టుకుంది. ఈ ఆసీస్ వెటరన్ యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక పెర్రీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
గతవారం హోలి సందర్భంగా తన జుట్టుకు అంటుకున్న రంగు ఇంకా పోలేదని.. దానిని వదిలించుకునే చిట్కాలు ఉంటే తనకు చెప్పాలని ఆమె అభిమానులను అడిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఈ నెల 8న ఆర్సీబీ క్యాంప్ లో హోలి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కెప్టెన్ స్మృతి మంధానతో పాటు జట్టు ఆటగాళ్లంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. ఎలీస్ పెర్రీని టీమ్ మెంబర్స్ రంగుల్లో ముంచెత్తారు. సప్తవర్ణాలు ఆమె శరీరంపై భాగమయ్యాయా అన్నంతగా రంగులు చల్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. హోలి తర్వాత పెర్రీ.. ‘పూయడమైతే పూశారు గానీ ఇది (రంగు) పోతుందా..? రెండు సార్లు జట్టు కడుక్కున్నా ఈ రంగు పోవడం లేదు. కొంపదీసి ఇది ఇలాగే ఉండిపోదు కదా..’ అని ట్విటర్ లో పేర్కొంది.
తాజాగా యూపీతో విజయం తర్వాత పెర్రీ స్పందిస్తూ.. ‘ఇండ్లల్లో ఉండేవారు ఎవరైనా నా జుట్టుకు అంటుకున్న గులాబీ రంగును పోగొట్టే చిట్కా చెప్పండి ప్లీజ్. మీరు నాకు చేసే పెద్ద సహాయం అదే. నా జుట్టుకున్న రంగును చూసినప్పుడల్లా ఏదో చిరాకు కలుగుతోంది. హోలి ఆడినప్పుడు బాగానే ఆడా. రంగులు బాగానే పూసుకున్నాం. కానీ నా జుట్టుకు మాత్రం పింక్ కలర్ అలాగే ఉండిపోయింది. కొంచెం ఈ రంగును పోగొట్టే మార్గం చెప్పండి..’అని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలాఉండగా యూపీ వారియర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్ లో బోణీ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ.. 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత ఆర్సీబీ తొలుత తడబడినా మిడిలార్డర్ లో కనిక అహుజా (46), రిచా ఘోష్ (31 నాటౌట్) లు రాణించి ఆ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఈ సీజన్ లో ఆర్సీబీ తర్వాత మ్యాచ్ లో గుజరాత్ ను ఢీకొననుంది.