Independence Day 2022: జాతికి వందనం.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం : దేశ ప్రజలకు క్రీడాకారుల శుభాకాంక్షలు
Independence Day 2022: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవాల వేళ జాతి మొత్తం ఒక్కతాటిపై నిలిచి అమరుల త్యాగాలను మననం చేసుకుంటున్నది.
దేశానికి స్వతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన శుభసందర్బంలో దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎర్రకోట మీద ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు జెండాను ఎగురవేశారు. పంద్రాగస్టును పురస్కరించుకుని దేశ క్రీడా ప్రముఖులు.. ప్రజలకు స్వతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ తన ట్విటర్ ఖాతా ద్వారా దేశ ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు. ‘హర్ గర్ తిరంగా’ క్యాంపెయిన్ లో భాగంగా తన ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేశారు.
సచిన్ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఎంఎస్ ధోని, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఓ వీడియో లో ధావన్.. ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వతంత్ర్యమని, దేశ ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు అని తెలిపాడు.
క్రికెటర్లే గాక ఇతర క్రీడాకారులు కూడా ప్రజలకు ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలిపారు. తమ ట్విటర్ ఖాతా ద్వారా జాతీయ జెండాతో ఉన్న తమ ఫోటోలను షేర్ చేశారు. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ప్రజలకు విషెస్ చెప్పాయి.
ఇక వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సామి కూడా భారత్ కు స్వతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ట్విటర్ లో అతడు స్పందిస్తూ.. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండియా. నేను అక్కడే (ఇండియాలో) నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాను.. ఎన్నో మంచి జ్ఞాపకాలు’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.