ఈడా ఉంటాం.. ఆడా ఉంటాం.. ఎక్కడబడితే అక్కడే ఉంటాం.. యూఎస్ఎ క్రికెట్ లీగ్లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీలదే హవా
Major League Cricket: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్న ఫ్రాంచైజీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలలో పెట్టుబడులు పెట్టిన ఫ్రాంచైజీలు తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కూడా కాలుమోపాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటినుంచి లీగ్ లో ఆడుతూ భారత్ లోనే గాక అంతర్జాతీయంగా కూడా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న పలు ఫ్రాంచైజీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. తమ పరిధిని ఖండాంతరాలకు వ్యాపిస్తున్నాయి. ఐపీఎల్ తో పాటు దక్షిణాఫ్రికా, యూఏఈ, కరేబియన్ క్రికెట్ లీగ్ లలో పెట్టుబడులు పెట్టిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాపైనే గురిపెట్టాయి. ఈ ఏడాది అమెరికా వేదికగా మొదలుకాబోయే ‘యూఎస్ఎ మేజర్ క్రికెట్ లీగ్’ (ఎంఎల్సీ) లో ఆరు ఫ్రాంచైజీలు ఉండగా అందులో నాలుగు టీమ్ లను ఐపీఎల్ టీమ్ ఓనర్లే దక్కించుకున్నారు.
ఐపీఎల్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ లు ఎంఎల్సీలో టీమ్ లను దక్కించుకున్నాయి. మిగిలిన రెండు జట్లనూ వేరేవాళ్లు దక్కించుకున్నా వాళ్లు కూడా భారతీయ సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. అంటే అమెరికాలో మినీ ఐపీఎల్ - 3 జరుగబోతోంది.
ఈ మేరకు ఎంఎల్సీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. నాలుగుసార్లు ఐపీఎల్ విజేత సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. సియాటెల్ లో ఢిల్లీతో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా కో ఓనర్ గా ఉన్నాడు.
ఈ నాలుగు జట్లే గాక వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీని భారత సంతతికి చెందిన అమెరికన్ పెట్టుబడిదారుడు సంజయ్ గోవిల్ కొనుగోలు చేశాడు. ఇక వాషింగ్టన్ డీసీ టీమ్ ను ఆనంద్ రామరాజన్, వెంకీ హరినారాయణ్ లు దక్కించుకున్నారు.
ఎంఎల్సీ లో తొలి సీజన్ ఈ ఏడాది జులై 13 నుంచి 30 వరకు డల్లాస్, టెక్సాస్ లలో జరుగనుంది. ఈ మేరకు మార్చి 19న వేలం కూడా నిర్వహించనున్నారు. ఈ లీగ్ లో అమెరికన్ స్థానిక క్రికెటర్లకు ప్రాధాన్యతనివ్వనున్నారు. ఒక జట్టులో 9 మంది విదేశీ క్రికెటర్లను తీసుకోవడానికి అవకాశముంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.