ఒకప్పుడు ధోని కొలీగ్.. ఇప్పుడు బతుకుదెరువు కోసం బస్ డ్రైవర్.. కుడి ఎడమైతే ఇంతేనా..!
Suraj Randiv: శ్రీలంక మాజీ క్రికెటర్ సూరజ్ రాందీవ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. ఐపీఎల్లో దిగ్గజ సారథి ధోని సహచర ఆటగాడు. కానీ ఇప్పుడు మాత్రం..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే క్రికెటర్లు ఉన్న ఈ రోజుల్లో ఫ్రాంచైజీ లీగుల మోజులో పడి కెరీర్లు కూడా పోగొట్టుకున్న క్రికెటర్లూ ఉన్నారు. కాలం కలిసిరాక.. జీవనోపాధి కోసం ఏదో ఓ పని చేసుకుని బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలంక మాజీ క్రికెటర్ సూరజ్ రాందీవ్. ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. ఐపీఎల్లో దిగ్గజ సారథి ధోని సహచర ఆటగాడు. కానీ ఇప్పుడు మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)లో బస్ డ్రైవర్..
శ్రీలంక జాతీయ జట్టులో ముత్తయ్య మురళీధరన్, రంగనా హెరాత్ల హవా కొనసాగుతున్న సమయంలో కూడా ఓ వెలుగు వెలిగాడు సూరజ్.. 2009 లో అతడు లంక తరఫున భారత్ తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
కెరీర్ ఆరంభం భారత్తో మ్యాచ్తోనే..
2009 - 10 సీజన్లో భారత్ లో పర్యటించిన శ్రీలంక టీమ్ లో సూరజ్ మెంబర్. అదే ఏడాది అతడు టెస్టులు, వన్డేలలో భారత్ తో ఆడుతూనే ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇచ్చాడు. లంక తరఫున 12 టెస్టులు (43 వికెట్లు), 31 వన్దేడు (36 వికెట్లు), 7 టీ20లు (7 వికెట్లు) ఆడాడు. 2011 లో భారత్ - శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా సూరజ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో 9 ఓవర్లు కూడా బౌలింగ్ చేసి 43 పరుగులిచ్చాడు.
ఐపీఎల్లో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సూరజ్ 2011 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. సీఎస్కేలో ధోనిసారథ్యంలో 8 మ్యాచ్ లు ఆడిన అతడు.. ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు.
సెహ్వాగ్ వివాదం..
2010లో ఇండియా - శ్రీలంక మ్యాచ్ లో భాగంగా వీరేంద్ర సెహ్వాగ్ 99 పరుగుల వద్ద ఉండగా భారత లక్ష్యానికి ఒక పరుగు అవసరం ఉంది. ఆ సమయంలో సూరజ్ ఉద్దేశపూర్వకంగానే నోబాల్ వేశాడు. ఇది గతంలో వివాదమైంది. లంక బోర్డు సూరజ్ పై ఒక్క మ్యాచ్ నిషేధం కూడా విధించింది.
లీగుల మోజుల్లో..
అప్పుడప్పుడే అంతర్జాతీయ స్థాయిలో టీ20కి క్రేజ్ సంతరించుకుంటుడంతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ కూడా పెరిగింది. దీంతో సూరజ్.. జాతీయ జట్టును వదిలి ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. అక్కడ ఓ డిస్ట్రిక్ట్ క్లబ్ లో కొన్నాళ్లు క్రికెట్ ఆడాడు. కానీ పరిస్థితులు అనుకూలించక ఫామ్ కోల్పోయాడు. అప్పుడు తిరిగి లంక జట్టులో మళ్లీ ప్రయత్నించినా అతడికి అవకాశాలు రాలేదు. దీంతో మెల్బోర్న్ లోనే ట్రాన్స్డెవ్ అనే కంపెనీలో ఉద్యోగిగా మారాడు. ఇదొక ట్రాన్స్పోర్ట్ కంపెనీ. ఈ సంస్థలో సూరజ్ డ్రైవర్ గా చేరాడు. సూరజ్ తో పాటు లంక మాజీ ఆటగాడు చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ప్లేయర్ వాడింగ్టన్ మ్వేంగా కూడా ఇక్కడే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సేవలు..
బతుకుదెరువు కోసం డ్రైవర్ గా మారినా సూరజ్ కు క్రికెట్ మీద మక్కువ పోలేదు. స్పిన్నర్ అయిన సూరజ్ సేవలను ఆస్ట్రేలియా.. 2020లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తమ దేశానికి వచ్చిన భారత స్పిన్నర్లను ఎదుర్కునేందుకు ఆసీస్.. సూరజ్ ను నెట్ బౌలర్ గా తీసుకొంది. ఈ ఏడాది కూడా అతడు జనవరిలో ఆసీస్ కు నెట్ బౌలర్ గా సేవలందించినట్టు సమచారం.