MS Dhoni: నాటు వైద్యానికి మళ్లిన ధోని.. ఆకు పసరు తాగుతున్న జార్ఖండ్ డైనమైట్
MS Dhoni Knee Treatment: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఏం చేసినా సంచలనమే. క్రికెట్ తో పాటు క్రికెటేతర విషయాల్లో కూడా ధోని తనదైన మార్కును చూపిస్తున్నాడు.
ఎంఎస్ ధోని.. పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ కు అతడు చేసిన సేవల గురించి ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే. భారత క్రికెట్ లో అతడు వ్యాపారసంస్థలకు ఓ హాట్ కేక్. ఇప్పుడు కాస్త తగ్గింది గానీ గతంలో ధోని కనిపించని యాడ్ లేదంటే అతిశయెక్తి కాదేమో. వీటి ద్వారా ధోని సంపాదించిందేమీ తక్కువ కాదు. ఒక్క యాడ్సేనా..? బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ సాలరీ, ఎండార్స్మెంట్స్ తో పాటు తాను కూడా ప్రత్యక్షంగా పలు సంస్థల్లో పెట్టుబడులు.. అబ్బో లిస్టు పెద్దదే.. ఇప్పుడిదంతా ఎందుకు...? అనేగా మీ డౌటానుమానం..? అక్కడికే వస్తున్నాం.
కొన్ని వందల కోట్లు సంపాదించిన ధోనికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు తక్కువయ్యాయా..? అతడు కావాలనుకుంటే ఈ భూప్రపంచం మీద ఎక్కడికైనా వెళ్లి చికిత్స చేసుకునే అవకాశముంది. కానీ ధోని మాత్రం వాటన్నింటినీ పక్కనబెట్టి సాదాసీదాగా వైద్యం చేయించుకుంటున్నాడు. డాక్టర్లు, హాస్పిటల్స్ గోల అన్నీ వద్దని నాటు వైద్యం వైపు మళ్లాడు. ఓ నాటు వైద్యుడి దగ్గరికెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు.
ధోనికి ఇటీవలే మోకాళ్లలో కాస్త నొప్పిగా అనిపించడంతో అతడు దానితో ఇబ్బంది పడుతున్నాడు. ధోని తన తల్లిదండ్రుల సూచనతో రాంచీకి దగ్గర్లోని ఓ గ్రామంలో ఉంటున్న నాటు వైద్యుడు వందన్ సింగ్ వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు.
వందన్ సింగ్ గురించి చెప్పాలంటే అతడు స్థానికంగా వరల్డ్ ఫేమస్ టైప్. గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండే జార్ఖండ్ లో చాలా మంది ప్రజలు అతడి దగ్గర వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. కొన్ని ఔషధ మొక్కలతో తయారుచేసిన పాలు, మందులను ఇస్తూ అతడు రోగాలను నయం చేస్తుంటాడని ఇక్కడ మంచి పేరుంది. మోకాళ్ల నొప్పులకు ధోని కూడా అతడి దగ్గరికి వెళ్లాడు.
తాజాగా ధోని తన దగ్గర వైద్యం చేయించుకోవడంపై వందన్ సింగ్ మాట్లాడుతూ.. ‘ధోని నా దగ్గరికీ మోకాళ్ల నొప్పులను నయం చేయించుకోవడానికి వచ్చాడు. అతడికి నేను నెల రోజుల పాటు సరిపోయే మందులు ఇచ్చాను. ధోని మళ్లీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అతడు మళ్లీ వచ్చాక మరో డోస్ ఇస్తా..’ అని చెప్పాడు. అయితే తనకు ముందు ధోని ఎవరో తనకు తెలియదని.. తాను మందులిచ్చిన తర్వాత బయటకు వెళ్తుంటే అక్కడ అందరూ అతడితో సెల్ఫీలు తీసుకుంటుండగా తనకు అతడే ధోని అని తెలిసిందని చెప్పాడు. ఇక ధోని రిటర్న్ అవుతుండగా.. పలువురు గిరిజనులు ధోనితో ఫోటోలు తీసుకున్నారు. ధోని వాళ్లందరితో కలిసి ఓపికగా ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.