T20 Worldcup: ఓమన్ జట్టులో హైదరాబాద్ క్రికెటర్.. కవాడిగూడ టు మస్కట్ దాకా సందీప్ ప్రయాణమిదే..
Oman Cricket Team: నేటి నుంచి మొదలైన టీ20 వరల్డ్ కప్ లో ఓమన్ జట్టు అర్హత రౌండ్ లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే ఓ హైదరాబాద్ క్రికెటర్ ఓమన్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.
యూఏఈ (UAE)వేదికగా నేటి నుంచి మొదలైన టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup)లో తొలి దశలో భాగంగా క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అర్హత రౌండ్ లలో భాగంగా తొలి మ్యాచ్ ఆతిథ్య ఓమన్ (Oman), పపువా న్యూ గినియా (Papua new guinea) ల మధ్య జరుగనున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం ఓమన్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఒక ఆటగాడు మన హైదారబాద్ (Hyderabad)కు చెందిన వాడే కావడం గమనార్హం.
ఓమన్ టీ20 వరల్డ్ కప్ లో సభ్యుడిగా ఉన్న శ్రీమంతుల సందీప్ గౌడ్ (sandeep Goud) మన హైదరాబాదీనే. 1991 నవంబర్ 8న మన భాగ్యనగరంలోని కవాడిగూడ లో జన్మించిన సందీప్.. గతంలో హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్ తో పాటు మీడియం పేసర్ అయిన సందీప్.. హైదరాబాద్ జట్టుతో కొన్ని రోజులు ఆడి తర్వాత ఉద్యోగం కోసం ఓమన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.
ఇది కూడా చదవండి: T20 World Cup: 16 దేశాలు.. 45 మ్యాచ్ లు.. నేటి నుంచే నెల రోజుల పొట్టి క్రికెట్ పండుగ షురూ..
ఈ క్రమంలో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ స్థానికంగా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ తన ప్రతిభను ఓమన్లకు పరిచయం చేశాడీ ఆల్ రౌండర్. పలు మ్యాచుల్లో సత్తా చాటడంతో అతడు ఆనతి కాలంలోనే జాతీయ జట్టు (Oman National Cricket Team)కు ఎంపికయ్యాడు.
2019 ఏప్రిల్ లో నమీబియా (Namibia)తో జరిగిన వన్డే మ్యాచ్ లో సందీప్ అరంగ్రేటం చేశాడు. అదే ఏడాది నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీ20ల్లోకి ప్రవేశించాడు. ఓమన్ తరఫున 19 వన్డేలతో పాటు 15 టీ20 మ్యాచ్ లు కూడా సందీప్ ఆడాడు. బ్యాటింగ్ తో విలువైన పరుగులు చేయడమే గాక బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. మరి ఈ మెగా ఈవెంట్ లో క్వాలిఫయింగ్ రౌండ్ దాటి సూపర్-12 కు చేరాలని తాపత్రయపడుతున్న ఓమన్ ను సందీప్ ఏ విధంగా ఆదుకుంటాడో కాలమే నిర్ణయిస్తుంది.