అంతా తూచ్.. ధోని అబద్దం చెప్పాడు.. పీటర్సన్ షాకింగ్ కామెంట్స్
MS Dhoni: తనను ఔట్ చేశాడని టీమిండియా మాజీ సారథి ధోని అబద్దం చెప్పాడని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సాక్ష్యాన్ని కూడా షేర్ చేశాడు.
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు, కొంతకాలం ఆ జట్టుకు సారథిగా కూడా పనిచేసిన కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ధోని తనను ఔట్ చేశాడని 2017లో అందరి ముందు అబద్దం చెప్పాడని, అందుకు సాక్ష్యం కూడా తనవద్ద ఉందని పీటర్సన్ తెలిపాడు.
వివరాల్లోకి వెళ్తే.. 2017 ఐపీఎల్ సందర్భంగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కు ఆడాడు (అప్పుడు చెన్నైపై నిషేధం ఉంది) ధోని. ఈ క్రమంలో ధోని టీమ్ లో ఉన్న బెంగాల్ ఆటగాడు, ప్రస్తుతం బెంగాల్ క్రీడాశాఖ మంత్రిగా ఉన్న మనోజ్ తివారి మైక్ పెట్టుకుని ఫీల్డింగ్ చేశాడు. ఆ క్రమంలో అవతలి వైపు పీటర్సన్ తివారితో.. ‘ధోని కంటే నేను బెస్ట్ గోల్ఫర్’అని చెప్పాడు.
ఆ విషయం తివారి.. ధోనికి చెప్పాడు. అదే సమయంలో ధోని.. ‘హీ ఈజ్ స్టిల్ మై ఫస్ట్ టెస్ట్ వికెట్’ (టెస్టులలో అతడే ఇప్పటికీ నా ఫస్ట్ వికెట్) అని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. తాజాగా పీటర్సన్ ఇది అబద్దమని, ధోని ఫస్ట్ టెస్ట్ వికెట్ తాను కాదని రుజువు చూపించాడు. ధోని తనను ఔట్ చేయలేదని.. వీడియో కూడా షేర్ చేశాడు.
2011లో భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించగా ఆ జట్టులో ధోని కూడా ఉన్నాడు. ఓవల్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో ధోని బౌలింగ్ చేశాడు. బంతి పీటర్సన్ ప్యాడ్స్ కు తాకడంతో అంపైర్ దానిని ఔట్ గా ప్రకటించాడు. కానీ పీటర్సన్ దానిని రివ్యూ కోరాడు. అప్పుడు థర్డ్ అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటించడంతో పీటర్సన్ బతికిపోయాడు. పీటర్సన్ ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తూ.. ‘ఇదిగో నా వైపు సాక్ష్యం పక్కాగా ఉంది. నేను ధోని ఫస్ట్ వికెట్ కాదు. కానీ అదైతే చాలా మంచి బాల్ ఎంఎస్!’అని రాసుకొచ్చాడు. కాగా ధోనిని టెస్టులో ఔట్ చేసిన వీడియోను కూడా పీటర్సన్ తన ట్విటర్ లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.