Ashes 2023: ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్  టెస్టులలో భీకర ఫామ్ లో కొనసాగుతున్నాడు. కానీ తన కెరీర్ లో మొదటిసారి.. 

యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టి డాన్ బ్రాడ్‌మన్ సెంచరీ (29) ల రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా రాణించాడు. 55 బంతుల్లోనే ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రూట్ స్టంపౌట్ అయ్యాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పదకొండేండ్ల రూట్ టెస్టు కెరీర్ లో అతడు స్టంపౌట్ అవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నాథన్ లియాన్ వేసిన 26వ ఓవర్లో రూట్ ముందుకొచ్చి ఆడబోయాడు. కానీ బంతి మిస్ కావడంతో వికెట్ కీపర్ అలెక్స్ కేరీ స్టంపౌట్ చేశాడు. 130 టెస్టులు ఆడిన రూట్.. టెస్టు క్రికెట్ లో స్టంపౌట్ అవడం ఇదే తొలిసారి. 

ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ లో స్టంపౌట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. రూట్ పేరిట 11,168 పరుగులున్నాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ శివనారాయణ్ చందర్‌పాల్ అగ్రస్థానంలో ఉన్నాడు. చందర్ పాల్ స్టంపౌట్ కాకుండా 11,414 పరుగులు చేశాడు. ఈ జాబితాలో టాప్ - 5 బ్యాటర్లు చూద్దాం. కోహ్లీ, సచిన్ లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. 

- 11,414 : చందర్‌పాల్ 
- 11,168 : జో రూట్ 
- 8,800 : గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) 
- 8,195 : విరాట్ కోహ్లీ 
- 7,419 : సచిన్ టెండూల్కర్ 

Scroll to load tweet…

రసవత్తరంగా తొలి టెస్టు : 

ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టు విషయానికొస్తే.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగుల నామమాత్రపు ఆధిక్యంతో కలిపి ఆ జట్టు ఆసీస్ ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 30 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (34 నాటౌట్), నైట్ వాచ్‌మెన్ స్కాట్ బొలాండ్ (13 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఆఖరి రోజు 174 పరుగులు కావాలి. ఇంగ్లాండ్ కు ఏడు వికెట్లు పడగొడితే విజయం ఆ జట్టు సొంతమవుతుంది.