రికీ పాంటింగ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. ఆసీస్ క్రికెట్ వర్గాల్లో టెన్షన్
Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. పెర్త్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా - వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ కు కామెంటేటర్ గా ఉన్న ఆయన అస్వస్థతకు గురవడంతో..
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆయన.. తన విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్ట్రేలియాలోని సెవన్ నెట్వర్క్ ఛానెల్ కు బ్రాడ్కాస్టర్ గా ఉన్న పాంటింగ్ ఆట మూడో రోజు కామెంట్రీ చెబుతుండగా ఛాతీలో నొప్పి వచ్చినట్టు తెలుస్తున్నది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాక స్వదేశంలో ఆస్ట్రేలియా ఆడే మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. తాజాగా విండీస్ తో సిరీస్ లో కూడా సెవన్ నెట్వర్క్ తరఫున పనిచేస్తున్నాడు. తొలి టెస్టులో మూడో రోజు ఆట మొదలయ్యాక 40 నిమిషాల పాటు కామెంట్రీ చెప్పిన పాంటింగ్ కు ఛాతీలో నొప్పి రావడంతో అతడు ఈ విషయాన్ని తన ఫ్రెండ్ జస్టిన్ లాంగర్ కు చెప్పాడు.
దీంతో లాంగర్, ఇతర సిబ్బంది పాంటింగ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదిక వెల్లడించింది. అయితే ప్రస్తుతం పాంటింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వార్తాలు వస్తున్నా ఆయన కోలుకుని బయటకు వచ్చేదాకా అంతా సస్పెన్సే.
47 ఏండ్ల పాంటింగ్.. ఆస్ట్రేలియా తరఫున 168 టెస్టులు, 375 వన్డేలు ఆడాడు. ఆ దేశం గర్వించదగ్గ ఆటగాళ్లలో పాంటింగ్ కూడా ఒకడు. పాంటింగ్ సహచర ఆటగాడు షేన్ వార్న్ ఈ ఏడాది ఏప్రిల్ లో ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించడం.. డీన్ జోన్స్ (2020లో), ర్యాన్ క్యాంప్బెల్ వంటి ఆటగాళ్లంతా గుండెపోటుతో చనిపోవడంతో మళ్లీ ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు ఆందోళన పడుతున్నాయి.
ఇక వెస్టిండీస్ -ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మ్యాచ్ ను ఆసీస్ శాసించే స్థితికి చేరింది. ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 598 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్.. 98.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో బ్రాత్వైట్ (64), టి.చందర్పాల్ (51), బ్లాక్వుడ్ (36) రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ లు తలా మూడు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (17 నాటౌట్), లబూషేన్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు.