ఫిరోజ్ షా కాదు... ఇకపై అరుణ్ జైట్లీ స్టేడియం: డిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటన
న్యూడిల్లీలోని ప్రతిష్టాత్మక క్రికెట్ స్టేడియం ఫిరోజ్ షా కోట్లా పేరు మార్చనున్నట్లు డిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇకపై దాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చనున్నట్లు తెలిపింది.
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి సాదర గౌరవం అందించడానికి డిడిసిఏ సిద్దమయింది. భారత్ లో క్రికెట్ అభివృద్దికి పాటుపడిన జైట్లీ పేరు చిరకాలం గుర్తిండిపోయేలా నిర్ణయం తీసుకుంది. న్యూడిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నట్లు డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డిడిసిఏ) ప్రకటించింది.
అరుణ్ జైట్లీ సుధీర్ఘకాలం డిడిసీఏ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1999 నుండి 2013 వరకు అంటే దాదాపు 14ఏళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగాడు. అంతేకాకుండా కొంతకాలం బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అతడు అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలోనే డిల్లీ తరపున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఆడారు. ఇలా ఎంతో మంది క్రికెటర్ల టాలెంట్ ను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడంలో జైట్లీ ముందుండేవాడు. ఇలా ఆయన సేవలకు గుర్తింపుగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి గౌరవించాలని డిడిసీఏ నిర్ణయం తీసుకుంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ఇదే స్టేడియంలోని ఓ స్టాండ్ కు పెట్టనున్నట్లు డిడిసీఏ ఇదివరకే ప్రకటించింది. సెప్టెంబర్ 12వ తేదీన జరిగే కార్యక్రమం ద్వారా అధికారికంగా కోట్లా స్టేడియం పేరుతో పాటు స్టాండ్ పేరు కూడా మారనున్నట్లు డిడిసీఏ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా, క్రీడామంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథులుగా రానున్నారు.
''ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. న్యూడిల్లీలోని ఈ ప్రతిష్టాత్మక స్టేడియం పేరు సెప్టెంబర్12వ తేదీ నుండి మారనుంది. అలాగే ఇదే కార్యక్రమంలో ఓ స్టాండ్ కు కూడా విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నాము.'' అని డిడిసీఏ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ చేసింది.