నన్ను యూఏఈలో మళ్లీ చూస్తారేమో: సంకేతాలిచ్చిన సురేశ్ రైనా
ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుబాయ్లో అడుగుపెట్టిన ఆ జట్టు స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వారం రోజులు గడవకముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు.
ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుబాయ్లో అడుగుపెట్టిన ఆ జట్టు స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వారం రోజులు గడవకముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు.
రైనా ఆకస్మాత్తుగా తప్పుకోవడం అంతా షాక్ అయ్యారు. కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం అనేవి రైనా తప్పుకోవడానికి గల కారణాలే అంటూ ప్రచారం జరిగింది.
అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ కుటుంబంలో జరిగిన విషాదం కారణంగానే తాను భారత్కు తిరిగి వచ్చేశానని రైనా నిన్న స్పష్టం చేశారు. తాజాగా క్రిక్బజ్తో మాట్లాడిన చిన్న తలా.. ఇండియాకు తిరిగి రావడం తన వ్యక్తిగత నిర్ణయమని, ఈ విషయంలో తనకు, ఫ్రాంచైజీకి మధ్య ఏలాంటి వివాదం చోటు చేసుకోలేదని రైనా వెల్లడించాడు.
కుటుంబానికి అండగా ఉండేందుకే టోర్ని నుంచి తప్పుకున్నానన్న సురేశ్ రైనా... చెన్నై సూపర్ కింగ్స్ కూడా తన ఫ్యామిలీ లాంటిదేనని, అందులో ధోనీ భాయ్ ఎంతో ముఖ్యమైన వ్యక్తని చెప్పాడు.
ప్రస్తుతం భారతదేశంలో ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నప్పటికి తాను ట్రైనింగ్లోనే ఉన్నానని తెలిపాడు. ఇదే సమయంలో సీఎస్కే జట్టుతో తనను యూఏఈలో మళ్లీ చూడవచ్చని ఫ్యాన్స్కు స్పష్టం చేశాడు.
కాగా సురేశ్ రైనా భారత్లో అడుగుపెట్టిన వెంటనే సీఎస్కే యజమాని శ్రీనివాసన్తో అతనికి విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిని ఖండించిన రైనా... శ్రీనివాసన్ తనకు తండ్రి లాంటి వారని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2020 కంటే ముందు జట్టుని విడిచిపెట్టడానికి అసలు కారణంగా శ్రీనివాసన్కు సైతం తెలియదని చిన్న తలా చెప్పాడు. శ్రీనివాసన్ తనకు ఎప్పుడూ అండగా నిలిచారని, చిన్న కొడుకులా చూసుకునేవారని రైనా వెల్లడించాడు.
‘‘ ఏక్ బాప్ అప్నే బచ్చే కో డాంట్ సక్తా హై’’ ( ఒక తండ్రి తన కొడుకును ఖచ్చితంగా తిట్టగలడు) అని వ్యాఖ్యానించాడు. మరో నాలుగైదేళ్లు చెన్నై తరపున ఆడాలని భావిస్తున్నట్లు రైనా తన మనసులోని మాటను బయటపెట్టాడు.