మా సంజూ ఎక్కడ..? గుండెల్ని తాకిన సూర్యా భాయ్ రెస్పాన్స్.. వీడియో వైరల్
Sanju Samson: టీమిండియా కేరళలో మ్యాచ్ ఆడేప్పుడు ఇదే రాష్ట్రానికి చెందిన ఆటగాడు సంజూ శాంసన్ జట్టులో ఉన్నా లేకపోయినా స్టేడియం అంతా ‘సంజూ సంజూ’అని మార్మోగిపోతుంది. రెండ్రోజుల క్రితం శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా భారత్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో సంజూ ఆడలేదు.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీమిండియా కేరళలో మ్యాచ్ ఆడేప్పుడు అతడు జట్టులో ఉన్నా లేకపోయినా స్టేడియం అంతా ‘సంజూ సంజూ’అని మార్మోగిపోతుంది. రెండ్రోజుల క్రితం శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా భారత్ మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో సంజూ లేడు. వన్డే సిరీస్ కంటే ముందు జరిగిన టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతూ గాయపడి జట్టుకు దూరంగా ఉన్నాడు. సంజూ లేకపోయినా గ్రీన్ ఫీల్డ్ స్టేడియం అతడి నామస్మరణతో మార్మోగింది.
అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ ను సంజూ ఫ్యాన్స్.. ‘హలో సూర్యా భాయ్.. మా సంజూ ఎక్కడ..?’అని అడిగాడు. దానికి సూర్య చెప్పిన సమాధానం సంజూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా గెలిచింది.
శాంసన్ అడిగిన ప్రశ్నకు సూర్య.. ‘నా గుండెల్లో ఉన్నాడు..’ అని అర్థం వచ్చేలా తన హృదయం దగ్గర లవ్ సింబల్ పెట్టి చూపించాడు. దీంతో సంజూ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూర్య చేసిన ఆ పనికి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
గతంలో కూడా సూర్య.. సంజూపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. గతేడాది తిరువనంతపురంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 కోసం భారత జట్టు ఇక్కడకు రాగానే అభిమానులంతా ‘సంజూ సంజూ’అని అరిచారు. అప్పుడు కూడా సంజూ.. టీమ్ లో చోటు కోల్పోయాడు. టీమిండియా ఆటగాళ్లు వెళ్తున్న బస్ కు ముందు అభిమానులు ‘సంజూ’ నినాదాలు చేయగా సూర్య తన ఫోన్ వాల్ పేపర్ మీద సంజూ ఫోటో చూపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన విషయం తెలిసిందే.
ఇక సంజూ విషయానికొస్తే.. శ్రీలంకతో టీ20 సిరీస్ కు ఎంపికైన అతడు వాంఖెడే వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి మోకాలికి గాయమైనట్టు తెలుస్తున్నది. దీంతో అతడిని ఎన్సీఏకు తరలించారు. కానీ సంజూను తప్పించడానికే బీసీసీఐ గాయం సాకు చెప్పి అతడిని ఎన్సీఏకు పంపించిందనే వాదనలూ ఉన్నాయి. లంక సిరీస్ ముగిశాక భారత్.. న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్ లలో సంజూకు చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.