పాత మొబైల్ ఫోన్లతో కోహ్లీ చిత్రం సృష్టించిన ఫ్యాన్: వీడియో
పాత మొబైల్ ఫోన్ల విడిభాగాలతో గౌహతికి చెందిన ఓ ఫ్యాన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించి తన అబిమానాన్ని చాటుకున్నాడు. ఆ అభిమానిని విరాట్ కోహ్లీ కలిసి, చిత్రంపై సంతకం చేశాడు.
గౌహతి: ప్రపంచ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు తానే సాటి. అందుకు తగినట్లుగానే ప్రపంచంలో ఏ క్రికెటర్ కు లేనంత అభిమానుల సంపద ఆయనకు ఉంది. విరాట్ కోహ్లీపై అభిమానాన్ని ఓ ఫ్యాన్ ప్రత్యేకంగా చాటుకున్నాడు. పాత మొబైల్ ఫోన్ విడిభాగాలతో విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించాడు.
విరాట్ కోహ్లీ ఆ ఫ్యాన్ ను కలుసుకున్నాడు. అంతేకాకుండా ఆ చిత్రం విశేష సృష్టికి గాను సంతకం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ పోస్టు చేసింది.
తాను గౌహతికి చెందినవాడినని, ఆ చిత్ర రూపకల్పనకు తనకు మూడు పగళ్లు, మూడు రాత్రులు పట్టాయని ఆ ఫ్యాన్ వీడియోలో చెప్పడం కూడా చూడవచ్చు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా టీ20 మ్యాచులో ఆదివారం సాయంత్రం శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంకపై జరిగే మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచు గౌహతిలో జరుగుతోంది.
వెస్టిండీస్ మీద టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలిచిన టీమిండియా ఈ ఏడాది శ్రీలంకపై విజయం సాధించి శుభారంభం చేయాలని భావిస్తోంది.