భద్రతావలయాన్ని దాటుకుని.. అభిమాన దేవుడి పాదాలను తాకి.. ఓ యువకుడి దుస్సాహసం
INDvsSL: టీమిండియా ఆడే మ్యాచ్ లో ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం కోహ్లీ ఆట చూడటానికే గ్రౌండ్ కు వచ్చే అభిమానులు వేలల్లో ఉంటారు. ఇక బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుంటే అతడితో...
భారత్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ ఢిల్లీ బ్యాటర్ గ్రౌండ్ లోకి దిగాడంటే అపోజిషన్ కు బ్యాండ్ బాజా బరాతే. టీమిండియా ఆడే మ్యాచ్ లో ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం కోహ్లీ ఆట చూడటానికే గ్రౌండ్ కు వచ్చే అభిమానులు వేలల్లో ఉంటారు. ఇక బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుంటే అతడితో ముచ్చట్లు, ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫ్ లకు లెక్కేలేదు. అవకాశం దొరికితే తమ అభిమాన క్రికెటర్ ను ఓసారి తాకితే చాలనే అభిమానులు లక్షల్లో ఉంటారు. నిన్న ఇండియా-శ్రీలంక మూడో వన్డే సందర్భంగా కూడా ఓ ఫ్యాన్ ఇదే చేశాడు.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెటర్లకు పోలీసులు, ఇతర సెక్యూరిటీ వాళ్ల భారీ భద్రత ఉంటుంది. మ్యాచ్ లేకుండా సాధారణ సమయాల్లో అయితే వాళ్లను కలిసే అవకాశం ఉంటుందేమో గానీ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆ భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికెళ్లాలంటే దుస్సాహసమే.
నిన్నటి మ్యాచ్ లో ఓ అభిమాని ఇదే దుస్సాహసం చేశాడు. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా - శ్రీలంక మ్యాచ్ లో లంక బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పోలీసులు, ఇతర సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని కోహ్లీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. కోహ్లీని అభిమానించే సదరు అభిమాని.. అతడి కాళ్లను మొక్కేందుకు యత్నించాడు.
అయితే అది చూసిన కోహ్లీ.. అతడిని పైకి లేపబోయాడు. అభిమానిని పైకి లేపి భుజం తట్టి అక్కడ్నుంచి పంపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గతంలో కూడా పలువురు అభిమానులు కోహ్లీ దగ్గరకు ఇలాగే వచ్చి ఓ హగ్ ఇవ్వడమో లేక ఓ సెల్ఫీ తీసుకోవడమో చేసేవారు. స్టేడియాల్లో ఉండే భారీ పెన్షింగ్ లను సైతం దూకి కోహ్లీని తాకి వెళ్లారు. వారిని ఏమీ అనవద్దని కోహ్లీ పోలీసు సిబ్బందికి చెప్పేవాడు.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166 నాటౌట్) లు సెంచరీలతో రాణించారు. తర్వాత బౌలింగ్ లో భారత్ అదరగొట్టింది. సిరాజ్ దాటికి లంక బ్యాటింగ్ కకావికలమైంది. సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా కుల్దీప్, షమీలకు తలా రెండు వికెట్లు దక్కాయి. లంక 73 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.