సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ... ఆఖరికి రుతురాజ్ గైక్వాడ్ కూడానా! మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో...
రుతురాజ్ గైక్వాడ్ కాళ్లపై పడిన అభిమాని... మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో సంఘటన... మావోడు ఫ్యూచర్ ధోనీ అంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్..
ఇండియాలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు, అంతకుమించి! భారతీయులకు ఉండే ప్రధాన వ్యాపకాలు రెండే రెండు. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. అందుకే సినిమా హీరోలను, క్రికెటర్లను కేవలం అభిమానించడమే కాదు, దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు కూడా...
టీమిండియా మ్యాచులు ఆడే సమయంలో చాలాసార్లు కొందరు అభిమానులు, సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి రావడం, తమ అభిమాన క్రికెటర్ల కాళ్ల మీద పడి, సెల్ఫీలు దిగడం చూశాం..
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో లెజెండరీ ప్లేయర్లుగా మారిన ఈ క్రికెటర్లను ఆరాధిస్తూ, కాళ్ల మీద పడ్డారంటే అనుకోవచ్చు... కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా పూర్తిగా కుదురుకోని ప్లేయర్కి ఇలాంటి అనుభవం ఎదురైతే...
2020 సీజన్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్, 2021 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు. 2022 సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున టాప్ స్కోరర్గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్, 2023 సీజన్లో డివాన్ కాన్వే తర్వాత అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే బ్యాటర్గా ఉన్నాడు..
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర టీమ్కి కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో ఓ అభిమాని, సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యి, రుతురాజ్ గైక్వాడ్ కాళ్లకు నమస్కరించాడు...
ఈ హఠాత్ సంఘటనను చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శుబ్మన్ గిల్కి టీమిండియాకి వరుస అవకాశాలు ఇస్తూ, రుతురాజ్ గైక్వాడ్ని పక్కనబెట్టడంపై అతని ఫ్యాన్స్, తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా...
2003లో యువీ, టీమ్కి ఆడుతున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా భారత జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోయాడని...రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు..
అభిమానం ఉండొచ్చు కానీ మరీ పాతికేళ్లు కూడా నిండని, సరిగ్గా 10 అంతర్జాతీయ మ్యాచులు కూడా ఆడని ప్లేయర్ కాళ్లపై పడడం మరీ ఓవర్గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.. చూస్తుంటే సెలబ్రిటీల కాళ్ల మీద పడి, సోషల్ మీడియాలో, వార్తల్లో నిలిచి పాపులర్ అవ్వాలని జనాలు ప్రయత్నిస్తున్నట్టు ఉందని, ఇది ట్రెండ్గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు నెటిజన్లు...
ఈ సంఘటనపై సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మావోడు ఫ్యూచర్ ధోనీ’ అంటూ డబ్బా పోస్టులు పెడుతున్నారు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో పుణేరీ బప్పా టీమ్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్కి స్టాండ్ బై ఓపెనర్గా సెలక్ట్ అయ్యాడు రుతురాజ్ గైక్వాడ్..
అయితే ఎలాగూ తనకు తుది జట్టులో చోటు దక్కదని భావించిన రుతురాజ్ గైక్వాడ్, డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకుని, తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు.. రుతురాజ్ గైక్వాడ్ భార్య ఉత్కర్ష కూడా కర్ణాటక ప్లేయరే.