ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కు కరోనా.. అన్నీ అపశకునములే.. అసలు ఈసారైనా టెస్టు జరిగేనా..?
Ben Foakes: ఇంగ్లాండ్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్నాళ్లుగా రోజుకో క్రికెటర్ చొప్పున ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కూడా పడ్డాడు.
గతేడాది కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఇండియా-ఇంగ్లాండ్ ఐదో టెస్టు ఈ ఏడాదైనా జరుగుతుందా..? రీషెడ్యూల్ ప్రకారం జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ టెస్టుకు కూడా కరోనా కాటు తప్పేట్టు లేదు. ఇప్పటికే టీమిండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారిన పడగా.. తాజాగా ఇంగ్లాండ్ టెస్టు జట్టు వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కు కూడా కరోనా నిర్ధారణ అయింది.
రోహిత్ కు కరోనా నిర్ధారణ కాకముందు అతడు టీమ్ మేట్స్ తో కలిసే ఉన్నాడు. ఆదివారం ఉదయం అతడికి కరోనా అని తెలియగానే టీమిండియాలో కలవరం మొదలైంది. టెస్టు ప్రారంభం నాటికి మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఈ మహమ్మారి బారిన పడినా ఆశ్చర్యం లేదు.
ఇక బెన్ ఫోక్స్ విషయానికొస్తే.. అతడు ప్రస్తుతం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య హెడ్డింగ్లీలో జరుగుతున్న మూడో టెస్టులో ఆడుతున్నాడు. కానీ ఆదివారం అతడికి కరోనా అని సోకడంతో ఆగమేఘాల మీద మరో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ అని పిలిపించి జట్టులో చేర్చారు. కానీ కరోనా బారిన పడటానికంటే ముందు అతడు కూడా జట్టుతో కలివిడిగా తిరిగినవాడే. దీంతో ఇంగ్లాండ్ క్యాంప్ లో కూడా కరోనా కలవరం మొదలైంది.
బెన్ ఫోక్స్ కు కరోనా సోకిన విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ.. ‘త్వరగా కోలుకో ఫోక్సీ.. బిల్లింగ్స్ కు స్వాగతం..’ అని ట్విటర్ లో షేర్ చేసింది. ఫోక్స్ భారత్ తో టెస్టుకల్లా అందుబాటులో ఉంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఐదో టెస్టు ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయముంది. ఇప్పటికైతే రోహిత్ తో పాటు ఫోక్స్ ఈ టెస్టు నాటికల్లా కోరుకుంటారని చెబుతున్నా అది అనుమానమే. వీరితో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడితే ఇక అంతే సంగతులు.