Ashes: ఆసీస్ ఆటగాళ్లతో కలిసి తెల్లారేదాకా పీకలదాకా తాగిన రూట్, ఆండర్సన్.. బయటకు గెంటేసిన పోలీసులు
England And Australia Cricketers Forced To Leave: గెలిచిన ఆనందంలో ఒకరు.. ఓడిన బాధలో మరొకరు.. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు కలిసి రాత్రనగా మొదలుపెట్టిన తాగుడు.. తెల్లవారి 6.30 అయినా ఆపలేదు. చివరికి పోలీసులు వచ్చి...
అసలే యాషెస్ సిరీస్ కోల్సోయిన బాధలో ఉన్న ఇంగ్లాండ్ సారథి జో రూట్, ఆ జట్టు ఇతర ఆటగాళ్లకు మరో షాకింగ్ న్యూస్. ప్రతిష్టాత్మక సిరీస్ లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో జో రూట్.. ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ తో కలిసి ఓ బార్ లో కూర్చుని పీకలదాకా తాగడమే గాక పోలీసులకు దొరికారు. యాషెస్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో జతకలిసిన ఈ ఇద్దరూ.. రాత్రి మొదలుపెట్టి తెల్లవారుజామున 6.30 దాకా తాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి వారిని బయటకు గెంటేశారు.
మైదానంలో ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకున ఇంగ్లాండ్-ఆసీస్ ఆటగాల్లు కలిసి విందు చేసుకున్నారు. యాషెస్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాథన్ లియాన్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీలు హోబర్ట్ లోని ఓ హోటల్ లో పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి మొదలైన ఈ పార్టీకి వారి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు జో రూట్, జేమ్స్ అండర్సన్ కూడా హాజరయ్యారు.
గెలిచిన ఆనందంలో ఆసీస్ ఆటగాళ్లు, ఓడిన బాధలో రూట్, అండర్సన్.. రాత్రనగా మొదలుపెట్టి ఉదయం 6.30 దాకా తాగారు. అయితే తాగినోళ్లు కామ్ గా కూర్చోక అక్కడ రభస చేశారు. దీంతో పలువురు స్థానికులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఈ అగ్రశ్రేణి ఆటగాళ్ల వాలకం చూసి బిత్తరపోయారు. వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లాలని వారిని హెచ్చరించారు.
‘మీ అల్లరి మరీ ఎక్కువైంది. తొందరగా ప్యాక్ చేసుకోవాలి. అందుకే మేమిక్కడి వచ్చాం. వెళ్లి నిద్రపోండి.. థాంక్యూ..’ అంటూ అక్కడికి వచ్చిన ఓ పోలీసు.. క్రికెటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు అలా హెచ్చరించడంతో ఆటగాళ్లు ఒక్కొక్కరు మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
ఇక ఇదే విషయమై టాస్మానియా పోలీసులు స్పందిస్తూ.. ‘క్రౌన్ ప్లాజా హోబర్ట్ నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందింది. కొంతమంది తాగిన మత్తులో అక్కడ రభస చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వాళ్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు అక్కడికి వెళ్లిన మా పోలీసులు వాళ్లను అక్కడ్నుంచి పంపించారు.అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు..’ అని తెలిపారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న రూట్.. ఈ ఘటనతో విమర్శల పాలయ్యాడు.
కాగా.. యాషెస్ లో తొలి మూడు టెస్టులలో పేలవ ప్రదర్శనతో ఓడి సిరీస్ కోల్పోయిన రూట్ సేన.. నాలుగో టెస్టును అతి కష్టమ్మీద డ్రా చేసుకుంది. ఇక హోబర్ట్ లో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ కథను కంగారూలు మూడు రోజుల్లోనే ముగించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను ఆసీస్ 4-0తో గెలుచుకుంది.