Ashes 2023: యాషెస్  సిరీస్ లో  భాగంగా ఎడ్జ్‌బాస్టన్ లో  జరుగుతున్న  టెస్టులో  ఆసీస్ ఆటగాళ్లపై ఇంగ్లాండ్ అభిమానులు నోరు జారుతున్నారు. 

ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ తో పాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్ లను ఇంగ్లాండ్ ఫ్యాన్స్ టీజ్ చేస్తున్నారు. ఈ ఇద్దర్నీ లక్ష్యంగా చేసుకుని ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజులో భాగంగా స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయడానికి వెళ్లగా ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇంగ్లాండ్ ఫ్యాన్స్.. బాల్ టాంపరింగ్ ఇష్యూను ప్రస్తావిస్తూ గేలి చేశారు.

స్మిత్ బౌండరీలైన్ వద్దకు చేరుకోగానే ‘స్మిత్.. నువ్వు ఏడుస్తుంటే మేం దానిని టీవీలలో చూశాం’ అంటూ బిగ్గరగా అరిచారు. స్టేడియం స్టేడియమే ముక్త కంఠంతో ఇదే విధంగా అరిచింది. వీరిని చూసిన స్మిత్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

స్మిత్ తో పాటు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ వార్నర్ కూడా టీజ్ చేశారు. నాలుగో రోజు లంచ్ తర్వాత గ్రౌండ్ లోకి వస్తున్న వార్నర్ ను చూసి అక్కడ ఉన్నవారంతా ‘చీటర్’అని అరిచారు. అది చూసిన వార్నర్ ‘హో హో’ అంటూ రెండు చేతులు లేపి వారికి కౌంటర్ ఇచ్చాడు.

Scroll to load tweet…

ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లు ఇలా చేయడం ఇదేం కొత్తకాదు. 2021 లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ ల మీద బాటిల్స్ విసరడం, అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

ఇక తాజాగా స్మిత్, వార్నర్ లు 2018 లో దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీనికి ఆ ఇద్దరితో పాటు మరో ఆటగాడు కామెరూన్ బ్యాంక్రాఫ్ట్ (ఇతడికి 9 నెలల పాటు) కూడా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కున్నారు. సాండ్ పేపర్ గేట్ గా ప్రసిద్ధి పొందిన ఈ వివాదం తర్వాత స్మిత్.. విలేకరుల సమావేశంలో తన తప్పును ఒప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇప్పుడు దీనినే ప్రస్తావిస్తూ అతడిని టీజ్ చేస్తుండటం గమనార్హం.